అనుమానాస్పద స్థితిలో యువకుడు మృతి

అనుమానాస్పద స్థితిలో యువకుడు మృతి
  • డెడ్‌‌బాడీతో పోలీస్‌‌స్టేషన్‌‌ ముందు కుటుంబ సభ్యుల ఆందోళన

టేక్మాల్, వెలుగు : ఓ వ్యక్తి అనుమానాస్పదంగా చనిపోగా, అతడి డెడ్‌‌బాడీతో కుటుంబ సభ్యులు పోలీస్‌‌ స్టేషన్‌‌ ఎదుట ఆందోళనకు దిగారు. ఈ ఘటన మెదక్‌‌ జిల్లా టేక్మాల్‌‌లో శుక్రవారం జరిగింది. టేక్మాల్‌‌ మండలం ఏక్లాస్‌‌పూర్‌‌ గ్రామానికి చెందిన గుంటి రాజు (30) గురువారం తన తల్లితో కలిసి వడ్లు అమ్మేందుకు పీఏసీఎస్‌‌ కొనుగోలు కేంద్రానికి వచ్చాడు. రాత్రి కావడంతో అతడి తల్లి ఇంటికి వెళ్లిపోయింది. రాజు రాత్రి 8 గంటల టైంలో టెక్మాల్‌‌లోని వైన్స్‌‌ వద్దకు వెళ్లాడు.

శుక్రవారం ఉదయం వైన్స్‌‌ ఆవరణలోని సీసీ రోడ్డుపై రాజు డెడ్‌‌బాడీ కనిపించింది. దీంతో స్థానికులు పోలీసులకు, బంధువులకు సమాచారం ఇచ్చారు. పోలీసులు ఘటనాస్థలానికి చేరుకొని వివరాలు సేకరించారు. రాజు మృతి అనుమానాస్పదంగా ఉండడంతో వైన్స్‌‌ వద్ద ఉన్న సీసీ ఫుటేజీని పరిశీలించగా కొందరు వ్యక్తులు రాజు డెడ్‌‌బాడీని పర్మిట్‌‌ రూమ్‌‌ నుంచి బయటకు తీసుకొచ్చి పడేసినట్లు కనిపించింది.

దీంతో వారిపై చర్య తీసుకోవాలంటూ రాజు డెడ్‌‌బాడీతో బంధువులు టెక్మాల్‌‌ పీఎస్‌‌ ఎదుట ఆందోళనకు దిగారు. విషయం తెలుసుకున్న సీఐ రేణుక స్టేషన్‌‌కు వచ్చి బాధితులకు న్యాయం చేస్తామన, నిందితులకు శిక్ష పడేలా చూస్తామని హామీ ఇవ్వడంతో ఆందోళన విరమించారు.