నందిగ్రామ్ రైలులో భారీ చోరీ

నందిగ్రామ్ రైలులో భారీ చోరీ
  • ఆదిలాబాద్​ వ్యాపారి సొత్తు మాయం
  • నాందేడ్ ​సమీపంలో బ్యాగులు ఎత్తుకెళ్లిన దొంగలు 
  • రూ.36 లక్షలు పోగొట్టుకున్న రియల్ ​ఎస్టేట్ ​వ్యాపారి  
  • కూతురి పెండ్లికి వెళ్లొస్తుండగా ఘటన

ఆదిలాబాద్​టౌన్​, వెలుగు: మహారాష్ర్టలోని నాందేడ్​సమీపంలో నందిగ్రామ్​రైలులో భారీ చోరీ జరిగింది. ఆదిలాబాద్​ జిల్లా కేంద్రానికి చెందిన రియల్​ఎస్టేట్​వ్యాపారి సురేశ్​అగర్వాల్​కు చెందిన రూ.36 లక్షల విలువ చేసే బంగారు ఆభరణాలు, నగదు దోపిడీ అయ్యాయి. బాధితుల కథనం ప్రకారం..పట్టణానికి చెందిన సురేశ్​అగర్వాల్​కూతురు పెండ్లి ఉండడంతో ఈ నెల 4న సుమారు 20 మంది కుటుంబసభ్యులు, బంధువులతో కలిసి మహారాష్ర్టలోని నాందేడ్ వెళ్లారు.

పెండ్లి తర్వాత ఈ నెల 5న నాసిక్​, త్రయంబకేశ్వర్​పుణ్యక్షేత్రాలు దర్శించుకోవడానికి వెళ్లారు. తర్వాత నందిగ్రామ్​రైలులోని ఏసీ క్లాస్​లో తిరిగి వస్తున్నారు. రూ.30 లక్షల విలువ చేసే బంగారు, వజ్రాభరణాలతో పాటు రూ.5లక్షల నగదు, రెండు సెల్​ఫోన్లను రెండు బ్యాగుల్లో పెట్టి పడుకున్నారు. 6వ తేదీ తెల్లవారుజామున 4 గంటల ప్రాంతంలో దొంగలు రెండు బ్యాగులను ఎత్తుకెళ్లారు.

నాందేడ్​ సమీపంలోకి వచ్చేసరికి బ్యాగులు కనిపించలేదు. దీంతో నాందేడ్​ రైల్వే పోలీసులకు ఫిర్యాదు చేశారు. మహారాష్ర్ట పోలీస్​, రైల్వే పోలీసులు దొంగల కోసం గాలింపు చర్యలు ముమ్మరం చేశారు. బాధితులు బ్యాగులో పెట్టిన సెల్​ఫోన్ల లొకేషన్లను పరిశీలించగా ఒకటి పర్లి బైద్యనాథ్​ వద్ద, మరొకటి ఔరంగాబాద్​లో ఉన్నట్టు చూపించింది. కాగా, ఇదే రైలులో ఈ వారంలో నాలుగు దొంగతనాలు జరిగినట్లు బాధితులు తెలిపారు.