పెళ్లైన వారం రోజులకే నగలు, నగదుతో పారిపోయిన నవ వధువు

పెళ్లైన వారం రోజులకే నగలు, నగదుతో పారిపోయిన నవ వధువు

పెళ్లి చేసుకున్న వారం రోజులకే భర్తను వీడిచిపెట్టి నగదు, నగలతో పరారైంది ఒక నవ వధువు. ఈ సంఘటన ఉత్తరప్రదేశ్‌లోని కాన్పూర్‌లో ఆదివారం (మే 28న) జరిగింది. కొత్తగా పెళ్లయిందన్న సంతోషం తీరకముందే తనను మోసం చేసి, పారిపోయిన భార్యపై రసూలాబాద్ పోలీసు స్టేషన్‌లో ఫిర్యాదు చేశాడో భర్త. నిరాలానగర్‌కు చెందిన బాధితుడు రాంకరణ్ వద్ద నుంచి పెళ్లిలు చేసే ఓ బ్రోకర్ రూ.70 వేల నగదు తీసుకుని పెళ్లి సంబంధం కుదిర్చాడు. ఈ క్రమంలో బీహార్‌కు చెందిన యువతితో మే 15న ధరమ్‌గఢ్ బాబా ఆలయంలో రాంకరణ్‌ పెళ్లి జరిగింది. మే 23న నవ వధువుతో తన స్వగ్రామానికి చేరుకున్నాడు రాంకరణ్. 

వారం రోజుల తర్వాత ఒక రోజు ఉదయం నిద్రలేచి చూసేసరికి రాంకరణ్ కు తన భార్య కనపడలేదు. చుట్టు పక్కల వెతికాడు. బంధువులను వాకబు చేశాడు. తనకు అనుమానం రావడంతో ఇంట్లోని బీరువా ఓపెన్ చేసి చూశాడు. ఇంకేముంది.. బీరువాలో దాచి ఉంచిన రూ. 50 వేల నగదుతోపాటు పెళ్లికి తన బంధువులు ఇచ్చిన బంగారు నగలు కూడా కనపడలేదు. నగదు, నగలతో తన భార్య పారిపోయిందని గ్రహించి.. వెంటనే రసూలాబాద్ పోలీసు స్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు. తనకు పెళ్లి సంబంధం కుదుర్చిన వ్యక్తిపైనా కేసు పెట్టాడు. రాం కరణ్ ఫిర్యాదు ఆధారంగా ఎఫ్‌ఐఆర్ నమోదు చేశారు పోలీసులు. పారిపోయిన రాంకరణ్ భార్య ఆచూకీ కోసం గాలిస్తున్నామని స్టేషన్ హౌస్ అధికారి రాం గోవింద్ మిశ్రా తెలిపారు.