అమెరికాలో కాల్పులు.. ఏపీ స్టూడెంట్ మృతి 

అమెరికాలో కాల్పులు.. ఏపీ స్టూడెంట్ మృతి 

అమరావతి : అమెరికాలో ఏపీ స్టూడెంట్ హత్యకు గురయ్యాడు. పెట్రోల్ బంక్ లో పని చేస్తున్న అతణ్ని.. అర్ధరాత్రి ఓ దుండగుడు కాల్చి చంపాడు. ఆంధ్రప్రదేశ్ లోని ఏలూరుకు చెందిన సాయేశ్ వీరా (25) రెండేండ్ల కింద ఎంఎస్ చేసేందుకు అమెరికా వెళ్లాడు. అక్కడ ఒహియో రాష్ట్రంలోని కొలంబస్ డివిజన్ లో ఉంటున్నాడు. సాయేశ్ వీరా ఎంఎస్ చేసుకుంటూనే, పార్ట్ టైమ్ గా పెట్రోల్ బంక్ లో పని చేస్తున్నాడు. ఎప్పటిలానే బుధవారం డ్యూటీకి వెళ్లాడు. అర్ధరాత్రి ఒంటిగంట (లోకల్ టైమ్) ప్రాంతంలో ఓ దుండగుడు పెట్రోల్ బంక్ కు వచ్చాడు. బంక్ లో దొంగతనం చేసేందుకు ప్రయత్నించగా సాయేశ్ వీరా అడ్డుకున్నాడు. దీంతో దుండగుడు తన దగ్గరున్న గన్ తో వీరాపై కాల్పులు జరిపి, అక్కడి నుంచి పరారయ్యాడు.

సమాచారం అందుకున్న పోలీసులు.. బంక్ కు చేరుకొని, బుల్లెట్ గాయాలతో పడి ఉన్న సాయేశ్ వీరాను ఆస్పత్రికి తరలించారు. తీవ్రగాయాలైన అతను ట్రీట్ మెంట్ పొందుతూ అర్ధరాత్రి 1:27 గంటలకు చనిపోయాడు. ఈ ఘటనపై అమెరికా పోలీసులు సాయేశ్ వీరా కుటుంబసభ్యులకు సమాచారం అందించారు. అనుమానితుడి ఫొటోలను విడుదల చేశారు. నిందితుడి కోసం వెతుకుతున్నారు. కాగా, ‘‘మాకు గురువారం రాత్రి సమాచారం అందింది. డెడ్ బాడీని ఇండియాకు తీసుకురావాలని కేంద్రానికి విజ్ఞప్తి చేశాం” అని సాయేశ్ వీరా బంధువు చెప్పారు. 

10 రోజుల్లో ఎంఎస్ అయిపోయేది.. 

సాయేశ్ వీరా వాళ్ల సొంతూరు పశ్చిమ గోదావరి జిల్లాలోని పాలకొల్లు కాగా,  కొన్నేండ్ల కింద ఏలూరుకు వచ్చి స్థిరపడ్డారు. కాలేజీ లెక్చరర్ గా పని చేసిన ఆయన తండ్రి నాలుగేండ్ల కింద గుండెపోటుతో చనిపోయారు. 2021 నవంబర్ లో ఎంఎస్ చేసేందుకు సాయేశ్ వీరా అమెరికా వెళ్లారు. ఇంకో 10 రోజుల్లో చదువు పూర్తయితుందనగా అతను చనిపోవడంతో ఆ కుటుంబంలో విషాదం నెలకొంది. కాగా, సాయేశ్ వీరా డెడ్ బాడీని ఇండియాకు పంపించేందుకు యలమంచిలి రోహిత్ ఆన్ లైన్ ఫండ్ రైజింగ్ ప్రారంభించారు. ఆయన మాట్లాడుతూ.. ‘‘ఇంకో పది రోజుల్లో సాయేశ్ ఎంఎస్ పూర్తయ్యేది. ఆ తర్వాత కొన్ని వారాలకు పెట్రోల్ బంక్ లో జాబ్ కూడా మానేద్దాం అనుకున్నాడు. ఇంతలోనే ఘోరం జరిగింది” అని చెప్పారు. సాయేశ్ వీరా మంచి క్రికెటర్ అని, కొలంబస్ ఏరియాలో చాలామందికి పరిచయం ఉన్నాడని తెలిపారు.