ఫ్యూచర్స్ అండ్ ఆప్షన్స్లో ట్రేడ్ చేసి నష్టపోతున్న యంగ్ ఇన్వెస్టర్లు
2021-22 లో యాక్టివ్ ట్రేడర్ల సగటు నష్టం రూ.1.25 లక్షలు
ప్రాఫిట్ సంపాదించింది 10 % మందే..
మొత్తం ప్రాఫిట్లో 51 శాతం వాటా ఒక శాతం యాక్టివ్ ట్రేడర్లదే
సెబీ రిపోర్ట్ వెల్లడి
బిజినెస్ డెస్క్, వెలుగు : ఎఫ్ అండ్ ఓ ట్రేడింగ్ చేస్తున్నవారిలో 90 శాతం మందికి నష్టాలే మిగులుతున్నాయనే విషయాన్ని సెబీ (డిపార్ట్మెంట్ ఆఫ్ ఎకనామిక్ ఎనాలసిస్ ) రిపోర్ట్ ఒకటి బలపరిచింది. ఈక్విటీ మార్కెట్లో ముఖ్యంగా ఫ్యూచర్స్ అండ్ ఆప్షన్స్ (ఎఫ్ అండ్ ఓ) సెగ్మెంట్లో ట్రేడింగ్ చేస్తున్న ప్రతీ 10 మందిలో 9 మందికి 2021–22 లో నష్టాలొచ్చాయంది. దేశంలోని టాప్ 10 బ్రోకరేజి కంపెనీల నుంచి డేటాను సేకరించి ఈ రిపోర్ట్ను సెబీ రెడీ చేసింది. 2019–20 తో పోలిస్తే 2021–22 లో ఎఫ్ అండ్ ఓ ట్రేడింగ్ చేసేవారు 500 శాతం పెరిగారని తెలిపింది. 2021–22 లో ఏకంగా 45.2 లక్షల మంది ఎఫ్అండ్ ఓ ట్రేడింగ్లో పార్టిసిపేట్ చేశారని పేర్కొంది. ఇండివిడ్యువల్ ట్రేడర్లు, యాక్టివ్ ట్రేడర్లు..రెండు వర్గాల గురించి సెబీ రిపోర్ట్లో ఉంది. ఏడాదికి ఐదు సార్లు కంటే ఎక్కువగా ట్రేడ్ చేసేవారిని యాక్టివ్ ట్రేడర్లుగా పిలవగా, ఎన్ఆర్ఐలు, హిందూ అన్డివైడెడ్ ఫ్యామిలీస్ను ఇండివిడ్యువల్ ట్రేడర్లుగా అభివర్ణించింది. ఇన్స్టిట్యూషనల్ కంపెనీలు, పార్టనర్షిప్లు, ఫైనాన్షియల్ కంపెనీలను ఈ ట్రేడర్ల లిస్టులో చేర్చలేదు.
ట్రేడర్లకు సగటున రూ. లక్షకు పైనే లాస్..
ఈ రిపోర్ట్ ప్రకారం, 2021–22 లో ప్రతీ 100 మంది ఇండివిడ్యువల్ ఇన్వెస్టర్లలో 89 మందికి నష్టాలే వచ్చాయి. వీరికి సగటున రూ. 1.1 లక్షల లాస్ వచ్చింది. అదే ప్రతీ 100 మంది యాక్టివ్ ట్రేడర్లలో 90 మందికి నష్టాలొచ్చాయి. వీరి సగటు లాస్ రూ. 1.25 లక్షలుగా ఉంది. ఇండివిడ్యువల్ ట్రేడర్లలో కేవలం 11 శాతం మంది, యాక్టివ్ ట్రేడర్లలో 10 శాతం మంది మాత్రమే లాభపడ్డారని సెబీ రిపోర్ట్ వెల్లడించింది. వీరిలో ఇండివిడ్యువల్ ట్రేడర్లు సగటున రూ.1.5 లక్షలు, యాక్టివ్ ట్రేడర్లు సగటున రూ.1.9 లక్షల ప్రాఫిట్ను సంపాదించారు. కానీ, ఈ ప్రాఫిట్ సాధించిన వారిలో కూడా చిన్న ట్రేడర్లు తక్కువే ఉన్నారు. ఈ రిపోర్ట్ ప్రకారం, ఎఫ్అండ్ఓ ట్రేడింగ్ చేసిన వారిలో 6 శాతం మంది ట్రేడర్ల సగటు ప్రాఫిట్ 2021–22 లో కేవలం రూ.3,400 గానే ఉంది. 2021–22 లో ఎఫ్అండ్ఓ ట్రేడర్లకు వచ్చిన మొత్తం ప్రాఫిట్లో 51 శాతం వాటా కేవలం ఒక శాతం మంది ట్రేడర్ల నుంచే ఉందని, 75 శాతం వాటా కేవలం 5 శాతం మంది ట్రేడర్ల నుంచే ఉందని సెబీ రిపోర్ట్ వెల్లడించింది. అదే యాక్టివ్ ట్రేడర్లకు సగటున రూ.50 వేల లాస్ వచ్చిందని తెలిపింది. ఈ రిపోర్ట్ ప్రకారం, 2021–22 లో సగటు యాక్టివ్ ట్రేడర్ సంపాదించిన ప్రాఫిట్ కంటే వచ్చిన లాస్ 15 రెట్లు ఎక్కువగా ఉంది.
ఆప్షన్స్పై పెరిగిన మోజు
రిటైల్ ఇన్వెస్టర్లు ఒకప్పుడు ఫ్యూచర్స్ సెగ్మెంట్లో ట్రేడ్ చేయడానికి ఎగబడేవారు. తాజాగా వీరి దృష్టి ఆప్షన్స్పై పెరిగింది. 2019–20 లో ఫ్యూచర్స్ సెగ్మెంట్లో ట్రేడ్ చేసిన రిటైల్ ఇన్వెస్టర్ల వాటా 43 శాతంగా ఉండేది. 2021–22 లో ఈ నెంబర్ 11 శాతానికి పడిపోయింది. మరోవైపు ఇదే టైమ్లో ఆప్షన్స్లో వీరి వాటా 89 శాతం నుంచి 98 శాతానికి ఎగిసింది. ఇండెక్స్ ఆప్షన్స్, స్టాక్ ఆప్షన్స్లో ట్రేడ్ చేస్తున్న రిటైల్ ఇన్వెస్టర్లు 8 రెట్లు వరకు పెరిగారు. ఫ్యూచర్స్, ఆప్షన్స్, షేర్లు ఇలా వివిధ ఈక్విటీ సెగ్మెంట్లలో ఎక్కువగా ప్రాఫిట్స్ సంపాదించిన వారు కోల్కతా నుంచి ఉన్నారని, అలానే నష్టాలొచ్చిన వారు కూడా ఎక్కువగా ఈ సిటీ నుంచే ఉన్నారని సెబీ రిపోర్ట్ వెల్లడించింది.
యంగ్ ఇన్వెస్టర్లకు పెద్ద దెబ్బ..
కరోనా సంక్షోభం తర్వాత మార్కెట్లోకి ముఖ్యంగా ఎఫ్అండ్ఓ ట్రేడింగ్లోకి ఎంట్రీ ఇచ్చిన చాలా మంది రిటైల్ ఇన్వెస్టర్లు నష్టపోయారు. సెబీ రిపోర్ట్ ప్రకారం, ట్రేడర్లలో 30-40 ఏళ్ల మధ్య ఉన్నవారు ఎక్కువగా ఉన్నారు. మరోవైపు 20-30 ఏళ్ల మధ్య ఉన్నవారి వాటా కూడా పెరిగింది. 2019-20 లో ఎఫ్అండ్ఓ ట్రేడింగ్లో ఈ ఏజ్ గ్రూప్ వారి వాటా 11 శాతం ఉంటే, 2021-22 లో 36 శాతానికి పెరిగింది. సీనియర్ సిటిజన్స్కు ఎక్కువగా నష్టాలొచ్చాయి. ఎఫ్ అండ్ ఓ సెగ్మెంట్లో మగవారే ఎక్కువగా ట్రేడ్ చేస్తున్నారు. 2021-22 లో ఎఫ్అండ్ఓ యాక్టివ్ ట్రేడర్లలో 84 శాతం వాటా వీరిదే ఉంది. కానీ, ప్రాఫిట్ సంపాదించిన యాక్టివ్ ట్రేడర్లలో మహిళల వాటా 28 శాతం ఉంది. 2021-22 లో మహిళలకు వచ్చిన నష్టం సగటున రూ.1.3 లక్షలుగా ఉంది. 2019-20 లో ఈ నెంబర్ రూ.1.9 లక్షలుగా రికార్డయ్యింది. అదే మగవారికి వచ్చిన నష్టం సగటున రూ. 1.9 లక్షల నుంచి రూ.1.1 లక్షలకు తగ్గింది.