
గ్రేటర్ హైదరాబాద్ లో అద్భుతం ఆవిష్కతమైంది. చాలా అరుదైన ‘జీరోషాడో’ ఆవిష్కృతమైంది. మే 9వ తేదీ మధ్యాహ్నం 12.12 నుంచి 12.14 గంటల వరకు అంటే 2 నిమిషాల వ్యవధిలో నీడ మాయమైంది. అంటే మన నీడ మనకు కనిపించలేదు ఆ రెండు నిమిషాలు.
సూర్య కిరణాలు నిట్టనిలువుగా పడటం వల్ల ఇలా జరుగుతుందని సైంటిస్టులు చెబుతున్నారు. ఎండలో నిటారుగా(90 డిగ్రీల) ఉంచిన వస్తువుల మీద రెండు నిమిషాలు నీడ కనిపించదని బిర్లా సైన్స్ సెంటర్ అధికారులు అంతకుముందే తెలియజేశారు. ప్రతిరోజూ సూర్యుడు మధ్యాహ్నం తలమీదుగా వెళ్తున్నట్టు కన్పిస్తున్నా.. జీరో షాడో ఉండదని అధికారులు చెప్పినట్లుగానే జరిగింది.
సూర్యుని గమనం ఉత్తరాయణంలో 6 నెలలు ఉత్తర దిశగా, దక్షిణాయనంలో 6 నెలలు దక్షిణ దిశగా ఉంటుంది. ఈ సమయంలో భూమి వంపు సుమారు 23.5 డిగ్రీలు ఉండటంతో భూమధ్య రేఖకు అన్ని డిగ్రీల ఉత్తర, దక్షిణ ప్రాంతాల్లో సూర్యుడు మధ్యాహ్నం నేరుగా తలమీద నుంచి వెళ్తాడని వివరించారు. ఉత్తరాయణంలో ఒకసారి, దక్షిణాయణంలో ఒకసారి చొప్పున ఏడాదికి రెండుసార్లు జీరోషాడో మూవ్మెంట్ ఉంటుందని పేర్కొన్నారు.