లక్నో : ప్రేమించడంలేదని ఓ యువకుడు స్కూల్ టీచర్ పై కాల్పులు జరిపాడు. తర్వాత అతడు కూడా తనను తాను కాల్చుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ సంఘటన ఉత్తర ప్రదేశ్ లోని జాన్ పూర్ జిల్లాలో ఆలస్యంగా వెలుగుచూసింది. 22 ఏళ్ల ఓ మహిళ షేర్ పట్టిలోని ఓ స్కూల్ లో టీచర్గా విధులు నిర్వహిస్తోంది. గురువారం మధ్యాహ్నం స్కూలు ముగిసిన తర్వాత ఇంటికి బయలు దేరింది. అయితే సుల్తాన్ పూర్ ఘౌరీకి చెందిన అంకుల్ యాదవ్ అనే యువకుడు బైక్ పై ఆమెను వెంబడించాడు. కొద్దిసేపటి తర్వాత ఆమెను అడ్డగించటంతో ఇద్దరి మధ్యా వాగ్వివాదం చోటుచేసుకుంది. ఈ క్రమంలోనే తీవ్ర ఆగ్రహానికి గురైన అంకుల్ ఆమెపై పిస్టల్తో కాల్పులు జరిపాడు.
తర్వాత తనను తాను కాల్చుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. బాధితురాలిని దగ్గరిలోని జిల్లా ఆసుపత్రికి తరలించారు స్థానికులు. తన ప్రేమను తిరస్కరించిందన్న కోపంతోనే స్కూల్ టీచర్పై యువకుడు కాల్పులు జరిపాడని తెలిపారు స్థానికులు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని యువకుడి డెడ్ బాడీని పోస్ట్ మార్టమ్ కోసం హాస్పిటల్ కి తరలించారు. కేసు నమోదు చూశామన్నారు పోలీసులు. ఇద్దరూ 12 వ తరగతి వరకు ఒకే చోట చదువుకున్నారని తెలిసిందన్నారు పోలీసులు. ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.