- క్షతగాత్రులకు చికిత్స చేసి ప్రాణాలు నిలుపుతున్న ఏబీసీ వలంటీర్లు
- మేడ్చల్ జిల్లా లో పైలట్ ప్రాజెక్టు
- ఆటోడ్రైవర్లు, టీచర్లు, స్టూడెంట్లను ఎంపిక చేసి ప్రత్యేక శిక్షణ
- ఐఐపీహెచ్ సహకారంతో అమలు
అది హైదరాబాద్లోని కుత్బుల్లాపూర్ సుచిత్ర సెంటర్. ఓ కారు, బైకు ఢీకొన్నాయి . బైక్ నడుపుతున్న వ్యక్తి కాళ్లు, చేతులు, తలకు తీవ్రంగా గాయాలయ్యాయి. అందరూ చుట్టూ మూగినా ఏం చేయాలో తెలియని పరిస్థితి. ఇంతలో ఆటో డ్రైవర్ కృష్ణ ఆ బాధితుడి దగ్గరికి వచ్చారు. తన దగ్గర ఉన్న ఫస్ట్ ఎయిడ్ కిట్ తీసికట్లు కట్టడంతో రక్తం కారడం ఆగిపోయింది. ఆలోపు అక్కడికి వచ్చిన 108లో బాధితుడిని ఆస్పత్రికి తరలించారు. సకాలంలో రక్తస్రావం ఆపడం, ప్రథమ చికిత్స అందడంతో క్షతగాత్రుడికి ప్రాణాపాయం తప్పిందని డాక్టర్లు చెప్పా రు.జీవీకే-ఈఎంఆర్ఐ నిర్వహిస్తున్న ‘యాక్టివ్ బ్లీడింగ్ కంట్రోల్(ఏబీసీ)’ పైలట్ ప్రాజెక్టు ఫలితం ఇది.ఆటో డ్రైవర్ కృష్ణ ఆ ప్రాజెక్టులో వలంటీర్. ఎక్కడ ఏ ప్రమాదం జరిగినా, వెంటనే ఫస్ట్ ఎయిడ్ చేసి ప్రాణాపాయం నుంచి తప్పించేలా ప్రత్యేకంగా శిక్షణ పొందారు. ఇలా ఒక్క కృష్ణ మాత్రమే కాదు.. వివిధ రంగాలకు చెందిన వెయ్యి మంది వలంటీర్లుగా పనిచేస్తున్నారు. మేడ్చల్ కారిడార్ లో కిలోమీటర్ ఏరియాకు ఒకరు అందుబాటులో ఉన్నారు. తమకు దగ్గరలో రోడ్డు ప్రమాదం జరిగి ఎవరైనా గాయపడితే,వారు వెంటనే రంగంలోకి దిగుతారు. క్షతగాత్రులకు ప్రాథమిక చికిత్స చేసి, కట్లుకట్టేసి రక్తం కారిపోకుండా నియంత్రిస్తారు. హైదరాబాద్ రోడ్లపై పెరిగిన ట్రాఫిక్తో 108 వాహనాలు సకాలంలో ప్రమాద స్థలానికి చేరుకోలేకపోతున్న నేపథ్యం లో జీవీకే–ఈఎంఆర్ఐఈ ఏబీసీ ప్రాజెక్టును చేపట్టాయి . వలంటీర్లు ఇప్పటివరకు 24 మంది ప్రాణాలు కాపాడారు.
డ్రోన్ల వినియోగంపై పూర్తయిన కసరత్తు
రోడ్డు ప్రమాదంలో గాయపడిన వారికి సత్వరమే వైద్యసాయం అందిం చే వలంటీర్లకు మందులు, బ్లడ్ ప్యాకెట్లు, ఏబీసీ కిట్లను త్వరగా అందించేందుకు డ్రోన్లు వినియోగించాలని జీవీకే–-ఈఎంఆర్ఐ భావిస్తోంది.అయితే భద్రతా కారణాల రీత్యా మన దేశంలో డ్రోన్ల వినియోగంపై ఆంక్షలున్నాయి . డ్రోన్లతో అత్యవసర వైద్య సాయం అందించడం ఎలాగనే దానిపై ఐఐపీహెచ్ సహకారంతో ఈఎంఆర్ఐ ఇప్పటికే కసరత్తుచేసింది. డైరెక్టర్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్(డీజీసీఏ), పోలీస్ శాఖ అనుమతులు లేకపోవడంతో వినియోగంలోకి తీసుకురాలేకపోతోంది. డీజీసీఏ అనుమతులు వస్తే డ్రోన్ల ద్వారా ప్రమాద ప్రాంతానికి మెడికల్ కిట్లు పంపించి సత్వర వైద్య సాయం అందించనున్నా రు.
ఐఐపీహెచ్ ఆధ్వర్యం లో శిక్షణ
రాష్ట్రంలో 2018లో 20,325 రోడ్డు ప్రమాదాలు జరగ్గా 5,985 మంది మరణించారు. ఈప్రమాదాల్లో ఎక్కువగా రక్త స్రావమై చనిపోయినవారే అధికంగా ఉన్నట్టు 108 సర్వీసులు నిర్వహిస్తున్న జీవీకే–-ఈఎంఆర్ఐ సంస్థ గుర్తించిం ది. ఈ నేపథ్యం లో రాష్ట్రం లోనే అత్యధికంగా రోడ్డు ప్రమాదాలు జరుగుతున్న జిల్లా అయిన మేడ్చల్ లో గతేడాది మార్చి 3న ‘ఏబీసీ’ ప్రాజెక్టును ప్రారంభించారు. స్వచ్చంధంగా సేవలు అందించేందుకు ముందుకొచ్చిన వెయ్యి మంది వలంటీర్లను ఎంపిక చేశారు. ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ పబ్లిక్ హెల్త్ (ఐఐపీహెచ్) ప్రొఫెసర్ల ఆధ్వర్యం లో.. గాయాలను గుర్తించడం, రక్తస్రావం ఆగిపోయేలా కట్టుకట్టడం, ఇతర ప్రథమ చికిత్సలపై శిక్షణ ఇచ్చారు. వారికి డిస్పోజబుల్ గ్లోవ్స్, డ్రెస్సింగ్ ప్యాడ్లు, ఫేస్ మాస్క్, రోలర్ బ్యాండేజీ, చిన్నసైజ్ వెదురు స్టిక్స్ తో కూడిన ఏబీసీ కిట్లను అందజేశారు. శిక్షణ పొందినవారిలో 351 మంది ఆటోడ్రైవర్లు, 114మంది విద్యార్థులు, ఆర్టీసీ సిబ్బంది, టీచర్లు,104 మంది కాలేజీ సిబ్బంది, 54 మంది బస్సు డ్రైవర్లు, 21 మంది దుకాణ యజమానులు, 51మంది ఓఆర్ఆర్ టోల్ ప్లాజా సిబ్బంది, 189మంది ఇతర రంగాల వారు ఉన్నా రు. ప్రస్తుతం సుచిత్ర, తుర్క యాంజాల్, అల్వాల్ ఏరియాల్లో వలంటీర్లు అందుబాటులో ఉన్నా రు.
