
- రేపు ఉట్నూరులో ఐటీడీఏ ముట్టడి
మంచిర్యాల జిల్లా: దండేపల్లి మండలం కోయ పోషగూడ ఆదివాసీలు చేపట్టిన ఛలో ఐటీడీఏ పాదయాత్ర కొనసాగుతోంది. ఆదివాసి సంఘాల ఐక్య పోరాట కమిటీ ఆధ్వర్యంలో ‘పోడు గర్జన’కు పిలుపునిచ్చిన విషయం తెలిసిందే. ఈనెల 10వ తేదీన కోయ పోషగూడ నుంచి బయలుదేరిన పోడు భూముల పోరు ఇవాళ మూడో రోజు కొనసాగింది. గండి రాంపూర్ లో పోచమ్మ తల్లికి పాట ద్వారా తమ బాధలు వినిపించారు ఆదివాసీలు. ఉట్నూర్ మండలం బిర్సాయిపేటలో వంట కోసం కాసపు ఆగారు. రేపు సోమవారం ఉట్నూరుకు చేరుకుని ఐటీడీఏను ముట్టడిస్తామని ఆదివాసీలు తెలిపారు. ఆదివాసీలు సాగు చేసుకుంటున్న పోడు భూములకు వెంటనే పట్టాలు ఇవ్వాలని, మహిళలపై అక్రమంగా పెట్టిన కేసులను ఎత్తివేయాలని ఈ సందర్భంగా వారు డిమాండ్ చేశారు.