ఏసీబీ వలలో మెదక్ జిల్లా అడిషనల్ కలెక్టర్

ఏసీబీ వలలో మెదక్ జిల్లా అడిషనల్ కలెక్టర్

మెదక్ జిల్లా: అవినీతి ఆరోపణలపై మెదక్ జిల్లా అడిషనల్ కలెక్టర్ నగేశ్, ఇతర అధికారుల ఇళ్లపై దాడులు కొనసాగిస్తున్నారు ఏసీబీ అధికారులు. ఇప్పటికే కీలక పత్రాలు స్వాధీనం చేసుకుంది ఏసీబీ. నర్సాపూర్ మండలం చిప్పల్ తుర్తిలోని 112 ఎకరాలకు NOC ఇచ్చేందుకు అడిషనల్ కలెక్టర్ నగేశ్ భారీగా లంచం డిమాండ్ చేసినట్లు చెప్పారు ఏసీబీ అధికారులు. ఎకరానికి లక్ష రూపాయల చొప్పున కోటి 12 లక్షలకు ఒప్పందం కుదిరిందన్నారు. కొంత మొత్తం చెల్లించినా.. 15 రోజులకు కూడా పని కాకపోవడంతో మూర్తి అనే రైతు.. ఏసీబీని ఆశ్రయించాడని చెప్పారు. దీంతో నగేశ్ 40లక్షలు లంచం  తీసుకుంటుండగా రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నట్లు తెలిపారు. మెదక్ మాచవరంలో లక్ష రూపాయల నగదుతో పాటు హైదరాబాద్ బోయినపల్లిలో లాకర్ ను గుర్తించారు అధికారులు.

బ్లాంక్  చెక్కులు, అగ్రిమెంట్  పేపర్లు, విలువైన డాక్యుమెంట్లు స్వాధీనం చేసుకున్నారు. నగేశ్ కేసులో 12 ప్రాంతాల్లో సోదాలు జరుగుతున్నాయని ఏసీబీ డీఎస్పీ సూర్యనారాయణ తెలిపారు. నర్సాపూర్ తహసీల్దార్ కార్యాలయంలోనూ ఏసీబీ సోదాలు నిర్వహించింది. ఆర్డీవో అరుణారెడ్డి, తహసీల్దార్ మాలతి, ఎమ్మార్వో, వీఆర్వో, వీఆర్ఏ, జూనియర్ అసిస్టెంట్ల ఇళ్లు, కార్యాలయాలపై ఏసీబీ సోదాలు కొనసాగుతున్నాయి. నర్సాపూర్ ఆర్డీఓ అరుణారెడ్డి ఇంట్లో జరిగిన సోదాల్లో ఇప్పటికే 26 లక్షల నగదు, అరకిలో బంగారం స్వాధీనం చేసుకున్నారు ఏసీబీ అధికారులు. చౌదరిగుడాలోని ఆమె నివాసంతో పాటు.. ఆమె బంధువుల ఇళ్లలోనూ ప్రస్తుతం దాడులు కొనసాగుతున్నాయి.