ముదిగొండ, వెలుగు: ఇంటి పర్మిషన్ కోసం రూ.25వేలు తీసుకుంటూ ఏసీబీకి చిక్కాడో పంచాయతీ సెక్రటరీ. ఖమ్మం జిల్లా ముదిగొండ మండలం బాణాపురం గ్రామానికి చెందిన వీరబాబు అనే వ్యక్తి కొత్త ఇంటి నిర్మాణానికి పర్మిషన్కోసం పంచాయతీ సెక్రటరీ తమ్మిశెట్టి సురేశ్ను సంప్రదించాడు. బిల్డింగ్ పర్మిషన్ మంజూరు చేసేందుకు రూ.40 వేలు లంచంగా డిమాండ్ చేయగా రూ.25 వేలు ఇచ్చేందుకు ఒప్పుకున్నాడు. కాగా లంచం ఇచ్చేందుకు ఇష్టపడని వీరబాబు ఏసీబీ అధికారులకు ఫిర్యాదు చేశాడు. దీంతో ప్లాన్ ప్రకారం.. ఏసీబీ అధికారులు ముదిగొండలోని రైతు వేదిక సమీపంలో శనివారం ఫిర్యాదుదారుని నుంచి రూ.25 వేలు తీసుకుంటుండగా పంచాయతీ సెక్రటరీ సురేశ్ను రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నారు. అనంతరం నిందితుడిని అరెస్ట్ చేసి వరంగల్ ఏసీబీ కోర్టులో హాజరుపరచనున్నట్లు ఏసీబీ డీఎస్పీ వై.రమేశ్ తెలిపారు.
