పద్మారావునగర్, వెలుగు: బ్లేడుతో 20 మందిని గాయపరిచిన కేసులున్నా నిందితుడు మళ్లీ అదే తరహా దాడి చేయడంతో ఒకరికి తీవ్ర గాయాలైన ఘటన బన్సీలాల్ పేట డివిజన్ సీసీ నగర్లో చోటు చేసుకుంది. గాంధీనగర్ పోలీసుల కథనం ప్రకారం.. సీసీ నగర్కు చెందిన బండారి భానుప్రకాశ్ ఈనెల 1న మధ్యాహ్నం తన ఇంటి ముందు కూర్చుండగా, కొత్తపెల్లి దినకర్ అనే వ్యక్తి వచ్చి ఇక్కడ ఎందుకు కూర్చున్నావ్.. అని భానుప్రకాశ్ను బెదిరిస్తూ బ్లేడ్ తో చేతిపై కోశాడు. దీంతో తీవ్ర రక్తస్రావం కావడంతో భానుప్రకాశ్ అరవడంతో దినకర్ అక్కడి నుంచి పరారయ్యాడు.
దీంతో పోలీసులు అతడిని గాలించి మోండా మార్కెట్ సమీపంలో అదుపులోకి తీసుకుని కేసు నమోదు చేసి రిమాండ్కు తరలించారు. దినకర్పై గతంలో గంజాయి, నార్కోటిక్ మత్తు పదార్థాల కేసులు ఉన్నాయని, మరో 20 మందిపై బ్లేడుతో దాడి చేసిన కేసులున్నాయని పోలీసులు తెలిపారు.