ఫైన్లు వేసి మా పొట్ట కొడుతున్నరు.. ఖైరతాబాద్ ఆర్టీవో ఆఫీస్ను ముట్టడించిన కాంక్రీట్ మిల్లర్ల ఓనర్లు

ఫైన్లు వేసి మా పొట్ట కొడుతున్నరు.. ఖైరతాబాద్ ఆర్టీవో ఆఫీస్ను ముట్టడించిన కాంక్రీట్ మిల్లర్ల ఓనర్లు

ఆర్టీవో అధికారులు వేస్తున్న భారీ జరిమానాలకు వ్యతిరేకంగా కాంక్రీట్ మిల్లర్లు, భవన నిర్మాణ కార్మికులు  మంగళవారం (జులై 07) తెలంగాణ బందుకు పిలుపునిచ్చారు. భారీ జరిమానాలు వేసి తమ పొట్ట కొడుతున్నారని ఆరోపిస్తూ..  ఖైరతాబాద్ లోని ఆర్టీవో కార్యాలయాన్ని ముట్టడించారు.  తమ ఉపాధి దెబ్బతీయొద్దంటూ ఆందోళన నిర్వహించారు.

ఆర్టీవో అధికారులు, పోలీసులు మిక్సర్ యంత్రాలపై ఈ మధ్య భారీగా జరిమానాలు వేస్తున్నారని ఆరోపించారు. ఒక్కో మిక్సర్ పై 25 వేల రూపాయల ఫైన్ విధిస్తున్నట్లు ఆరోపించారు. టార్గెట్ల కోసం నిబంధనలకు తూట్లు పొడుస్తూ తమ జీవనోపాధిని దెబ్బతీస్తున్నారని మండిపడ్డారు. 

 ఆర్టీవో అధికారులకు వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ ఆర్టీవో కార్యాలయం ముందు ధర్నాకు దిగారు. ఈ క్రమంలో పోలీసులకు కాంక్రీట్ మిల్లర్లు భవన కార్మికులకు మధ్య వాగ్వాదం జరిగింది. అనుమతి లేకుండా లోపలికి రావద్దని పోలీసులు హెచ్చరిక జారీ చేశారు. బయటికి వెళ్లాలని సూచించారు. దీంతో తమకు న్యాయం జరిగే వరకు బయటకు వెళ్లే ప్రసక్తే లేదని తేల్చిచెపుతున్నారు. దీంతో అక్కడ ఉద్రిక్త వాతావరణం నెలకొంది. 

ధర్నా ఎందుకు..?

హైదరాబాద్ వంటి మహానగరాన్ని నిర్మించడంలో కీలక పాత్ర పోషిస్తున్న కాంక్రీట్ ఓనర్లపై ప్రభుత్వం, ఆర్టీఏ వ్యవహరించే తీరుపై తీవ్ర విమర్శలు చేస్తున్నారు. ఒక్కో మిక్సర్ వాహనంపై 15 నుంచి 25 వేల రూపాయల ట్యాక్స్ వేయడం పై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ బంద్ కు పిలుపునిచ్చారు. ఈ క్రమంలో ఖైరతాబాద్ ఆర్టీవో కార్యాలయాన్ని ముట్టడించారు.

జరిమానాలు ఎందుకు..?

 మిక్సర్ల నుంచి కాంక్రీట్ రోడ్లపై పడటం వల్ల రోడ్లు దెబ్బతింటున్నాయని ఆర్టీవో అధికారులు చెబుతున్నారు. రోడ్డుపై కాంక్రీట్ గడ్డకట్టడం వల్ల వాహనదారులు, ముఖ్యంగా ద్విచక్ర వాహనదారులు జారిపడి ప్రమాదాలకు గురవుతున్నారని అంటున్నారు. ఇక  కొత్త మోటారు వాహనాల చట్టం ప్రకారం ట్రాఫిక్ కు అంతరాయం కలిగించడం, ప్రమాదకరంగా డ్రైవ్ చేయడం కారణమని తెలిపారు.
మిగిలిపోయిన కాంక్రీట్ వ్యర్థాలను ఇష్టమొచ్చిన చోట పారవేయడం వల్ల  సిటీలో శుభ్రత కోల్పోవడంతో పాటు.. రోడ్లపై ప్రమాదాలు జరుగుతున్నాయి. అందుకే జరిమానాలు విధించాల్సి వస్తుందని అధికారులు చెబుతున్నారు.