దళిత యువకుడిపై దాడి ఘటనలో.. ట్రైనీ ఎస్సైపై చర్యలకు సిఫార్సు

దళిత యువకుడిపై దాడి ఘటనలో.. ట్రైనీ ఎస్సైపై చర్యలకు సిఫార్సు

 

  • ఇద్దరు కానిస్టేబుళ్లు హెడ్‌‌ క్వార్టర్స్‌‌కు అటాచ్‌

కరీంనగర్, వెలుగు : కరీంనగర్‌‌ జిల్లా సైదాపూర్ మండలంలో దళిత యువకుడు బత్తుల మహేందర్‌‌పై దాడి ఘటనలో ఉన్నతాధికారులు చర్యలు చేపట్టారు. హుజూరాబాద్‌‌ ఏసీపీ మాధవి ఇచ్చిన రిపోర్ట్‌‌ ఆధారంగా కానిస్టేబుళ్లు ఆకాశ్‌‌, అజయ్‌‌కి మెమో జారీ చేయడంతో పాటు వారిని హెడ్‌‌క్వార్టర్స్‌‌కు అటాచ్‌‌ చేసినట్లు సీపీ గౌష్‌‌ ఆలం వెల్లడించారు.

ఇక ట్రైనీ ఎస్సై అగస్త్య భార్గవ్‌‌పై క్రమశిక్షణా చర్యల కోసం మల్టీ జోన్ ఐజీకి సిఫార్సు చేసినట్లు తెలిపారు. అలాగే పోలీసుల డ్యూటీకి ఆటంకం కలిగించాడని కానిస్టేబుల్‌‌ అజయ్‌‌ ఫిర్యాదుతో మహేందర్‌‌పైనా కేసు నమోదు చేసినట్లు చెప్పారు.