వెన్నెలపై అత్యాచారం.. నిందితులకు ఉరిశిక్ష పడేలా చర్యలు

వెన్నెలపై అత్యాచారం.. నిందితులకు ఉరిశిక్ష పడేలా చర్యలు

వరంగల్ అర్బన్ : హన్మకొండలో 9వ తరగతి బాలిక అత్యాచారానికి గురై చనిపోయిన కేసు నిందితులకు ఉరిశిక్ష పడేలా చర్యలు తీసుకుంటామన్నారు పంచాయతీ రాజ్ శాఖమంత్రి ఎర్రబెల్లి దయాకరరావు. హన్మకొండ సమ్మయ్యనగర్ కాలనిలో అత్యాచారానికి గురై మరణించిన మైనర్ బాలిక వెన్నెల కుటుంబ సభ్యులను సోమవారం ఓదార్చారు మంత్రి ఎర్రబెల్లి. ఈ సందర్భంగా మాట్లాడిన ఆయన.. 9 నెలల చిన్నారి శ్రీహిత హత్య కేసు నిందితుడికి పడిన ఉరి శిక్షలాగే..వెన్నల కేసు నిందితులకు కూడా పడుతుందన్నారు.

సీఎం కేసీఆర్ స్వయంగా ఈ కేసు గురించి ఆరాదీశాడని.. అన్ని రకాలుగా ఆదుకుంటాం అని భరోసా ఇచ్చారు. ఫాస్ట్రాక్ కోర్టు ద్వారా ఇలాంటి ఘటనలపై చర్యలు తీసుకుంటామన్న ఎర్రబెల్లి.. వరంగల్ లో మహిళల భద్రతకోసం ప్రత్యేక కమిటీని ఏర్పాట్లు చేస్తామన్నారు. షీటీంలను బలోపేతం చేసేందుకు చర్యలు చేపడతామని తెలిపారు. మహిళల భద్రత కోసం అందరు కలిసి రావాలని సూచించారు. ప్రజలను చైతన్యం చేసే కార్యక్రమాలు, నిరసనలు చేయాలని.. ఇలాంటి సంఘటనలను రాజకీయం చేయడం తగదని చెప్పారు మంత్రి ఎర్రబెల్లి.