వినియోగంలోకి చేతిపంపులు..బోర్లు!

వినియోగంలోకి చేతిపంపులు..బోర్లు!
  • తాగునీటి ఎద్దడి తలెత్తకుండా రాష్ట్ర సర్కారు చర్యలు
  •     భగీరథ నీళ్లు అందని చోట్ల ప్రత్యామ్నాయ మార్గాల అన్వేషణ
  •     బోర్లు, చేతిపంపుల రిపేర్ల కోసం ఒక్కో నియోజకవర్గానికి రూ.3 కోట్లు
  •     ఎంపీడీవోల ఆధ్వర్యంలో యుద్ధప్రాతిపదికన పనులు
  •     విధుల్లో చేరుతున్న చేతి పంపు మెకానిక్​లు

జయశంకర్‌‌‌‌ భూపాలపల్లి, వెలుగు : మార్చిలోనే ఎండలు మండుతుండడం, రిజర్వాయర్లు అడుగంటి భగీరథ నీళ్లు బంద్‌‌ అవుతున్న నేపథ్యంలో రాష్ట్ర సర్కారు అలర్ట్‌‌ అయింది. గ్రామాల్లో తాగునీటి ఎద్దడి తలెత్తకుండా ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేస్తోంది. ముఖ్యంగా ఊరూరా గతంలో ఉన్న బావులు, బోర్లను, చేతిపంపులను వినియోగంలోకి తీసుకురావాలని నిర్ణయించింది. ఇందుకోసం ఎమ్మెల్యేలకు గతంలో కేటాయించిన ఫండ్స్​నుంచి ప్రతీ అసెంబ్లీ నియోజకవర్గానికి రూ.3 కోట్లు వాడుకోవాలని సూచించింది. ఈ క్రమంలో ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు రాష్ట్రవ్యాప్తంగా ఆర్‌‌డబ్ల్యూఎస్‌‌ ఆఫీసర్లు రంగంలోకి దిగి బావుల్లో పూడికతీతతోపాటు బోర్లు, మోటర్లకు రిపేర్లు చేయిస్తున్నారు. ముఖ్యంగా గత సర్కార్‌‌ తొలగించిన 320 మంది మెకానిక్‌‌లను తిరిగి విధుల్లోకి తీసుకొని ఎంపీడీవోల అధ్వర్యంలో చేతిపంపులను బాగుచేయిస్తున్నారు.

గ్రామాలకు అందని భగీరథ నీళ్లు

రాష్ట్రవ్యాప్తంగా అన్ని గ్రామాలు, మున్సిపాలిటీలు, కార్పొరేషన్ల పరిధిలో ఇంటింటికీ నల్లానీరు అందించాలన్న లక్ష్యంతో గత బీఆర్ఎస్‌‌  సర్కార్‌‌ సుమారు రూ.40 వేల కోట్లు  ఖర్చు చేసి మిషన్‌‌‌‌ భగీరథ పథకం చేపట్టింది. గోదావరి, కృష్ణా నదులు, వాటిపై ఆధారపడ్డ డ్యామ్‌‌లు, రిజర్వాయర్ల నుంచి తాగునీరు అందిస్తామని పేర్కొంది. 2016లో చేపట్టిన ఈ పథకం ద్వారా 24,028 అవాసాలకు తాగునీరు అందిస్తున్నామని గత అసెంబ్లీ ఎన్నికల ముందు కేసీఆర్‌‌ సర్కారు ప్రకటించింది.  కానీ ఎనిమిదేళ్లు గడిచినా చాలాచోట్ల పనులు పూర్తి కాలేదు. పూర్తయిన చోట్ల పనుల్లో క్వాలిటీ లేకపోవడంతో ప్రెషర్‌‌ పెరిగితే పైపులు పగిలిపోతున్నాయి. పాత ట్యాంకులు, పాతపైపులైన్లతో లీకేజీలు పెరుగుతున్నాయి. ఈ క్రమంలో వేలాది గ్రామాలకు తాగునీరు అందడం లేదు. పట్టణాల్లోనూ చాలా కాలనీల్లో వారానికి ఒకటి, రెండు రోజులు తప్ప నీళ్లు రాని పరిస్థితి. దీంతో ఇంతకాలం ఆయా పంచాయతీలు, మున్సిపాలిటీలు పాత బోర్లు, బావులకు రిపేర్లు చేసి భగీరథ ట్యాంకుల ద్వారా లోకల్‌‌గా వాటర్‌‌ సప్లై చేస్తూ వచ్చాయి. కానీ ఈ ఏడాది వర్షాభావ పరిస్థితులు, తాజాగా మార్చి ప్రారంభంలోనే ఎండల తీవ్రతతో రిజర్వాయర్లతో పాటు బోర్లు, బావులు అడుగంటుతున్నాయి. దీంతో నీళ్లు లేక జనం రోడ్లెక్కుతున్నా వాటర్​ సప్లై చేయలేక ఆర్‌‌డబ్ల్యూఎస్‌‌ ఆఫీసర్లు చేతులెత్తేస్తున్నారు. 

రిపేర్లకు ఎమ్మెల్యే ఫండ్స్​ నుంచి రూ.3 కోట్లు

తాగునీటి ఎద్దడి నివారణకు తీసుకోవాల్సిన చర్యలపై రాష్ట్ర సర్కారు.. ఆర్‌‌‌‌డబ్లూఎస్‌‌ ఆఫీసర్ల నుంచి గ్రౌండ్​రిపోర్ట్​తీసుకున్నట్లు తెలుస్తోంది. రిజర్వాయర్లు అడుగంటుతున్న కారణంగా చాలా గ్రామాలకు భగీరథ నీళ్లు అందడం లేదని, అందువల్ల గతంలో ఉన్న బోర్లు, మంచినీటి బావులు, చేతిపంపులను  తిరిగి వినియోగంలోకి తీసుకురావాలన్న ఆఫీసర్ల ఆలోచన మేరకు ప్రత్యామ్నాయ మార్గాలపై ప్రభుత్వం దృష్టి పెట్టింది. సీఎం రేవంత్‌‌రెడ్డి ఇటీవల ప్రతీ ఎమ్మెల్యేకు రూ.10 కోట్ల చొప్పున ఫండ్స్‌‌ కేటాయించిన విషయం తెలిసిందే. ఆయా అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలో ప్రజా అవసరాలకు ఈ నిధులను వినియోగించాల్సి ఉంది. తాజా పరిస్థితుల నేపథ్యంలో ఎమ్మెల్యేలకు కేటాయించిన నిధుల్లోంచి రూ.3 కోట్లను నియోజకవర్గాల్లో తాగునీటి ఎద్దడి నివారణకు ఖర్చు చేయాలని సర్కారు సూచించినట్లు తెలుస్తోంది. ఇందులో భాగంగానే  పలు నియోజకవర్గాల్లో ఎమ్మెల్యేల సూచన మేరకు రంగంలోకి దిగిన ఆఫీసర్లు గ్రామాల్లోని పాత బావులను, బోర్లను, చేతిపంపులను వినియోగంలోకి తీసుకువస్తున్నారు. బావుల్లో పూడికతీత, బోర్ల డ్రిల్లింగ్, మోటార్లు, పాత పైప్‌‌లైన్లకు రిపేర్లు చేయిస్తున్నారు.

డ్యూటీలోకి మెకానిక్‌లు

గ్రామాలు, పట్టణాల్లోని చేతిపంపులను రిపేర్‌‌‌‌ చేయడానికి గతంలో మండలానికో  మెకానిక్‌‌‌‌ ఉండేవారు. మండల పరిషత్‌‌‌‌ ఖాతా నుంచి ఒక్కో మెకానిక్‌‌‌‌కు నెలకు రూ.12 వేల నుంచి రూ.15 వేల వరకు గౌరవ వేతనం అందించేవారు. ప్రతీ ఎంపీడీవో పరిధిలో ఈ మెకానిక్‌‌‌‌లు పనిచేసేవారు.  2016లో మిషన్‌‌‌‌ భగీరథ స్కీం తెచ్చాక కేసీఆర్‌‌‌‌ సర్కారు  రాష్ట్ర వ్యాప్తంగా పనిచేస్తున్న సుమారు 320 మంది చేతిపంపు మెకానిక్‌‌‌‌లను పక్కనపెట్టింది. దీంతో చిన్నచిన్న రిపేర్లు చేసేవారు లేక ఒక్కో మండలంలో వందకు పైగా చేతిపంపులు  మూలనపడ్డాయి.  ఉద్యోగం లేకపోవడంతో పంప్‌‌‌‌మెకానిక్‌‌‌‌లు  అడ్డా కూలీలుగా మారిపోయారు. సర్కారు ఆదేశాలమేరకు ఎంపీడీవోలు ఆయా మండలాల్లో  చేతిపంపు మెకానిక్​లను తిరిగి డ్యూటీల్లో జాయిన్​ చేసుకున్నారు.  ఈ నెల 5వ తారీఖు నుంచే రిపేర్లు మొదలుపెట్టిన మెకానిక్​లు ఇప్పటికే ఒక్కో మండలంలో  10 నుంచి 20 వరకు చేతిపంపులను  వినియోగంలోకి తెచ్చినట్లు ఆఫీసర్లు చెప్తున్నారు.