‘మా’ బిల్డింగ్: మంచు విష్ణుతో నేనూ భాగస్వామి అవుతా

‘మా’ బిల్డింగ్: మంచు విష్ణుతో నేనూ భాగస్వామి అవుతా

హైదరాబాద్: మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ (మా) ఎన్నికల విషయంపై టాలీవుడ్‌లో గత కొన్ని రోజులుగా రగడ నడుస్తోంది. ఈ అంశంపై నటరత్న నందమూరి బాలకృష్ణ స్పందించారు. ఇన్ని రోజులు ‘మా’ బిల్డింగ్ ఎందుకు కట్టలేకపోయారని ఓ మీడియా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ప్రశ్నించారు. భవనం కోసం తెలంగాణ సర్కార్‌ను అడిగితే భూమి ఇవ్వరా అని క్వశ్చన్ చేశారు. బిల్డింగ్ నిర్మాణం కోసం మంచు విష్ణు ముందుకొస్తే తానూ భాగస్వామిని అవుతానని బాలకృష్ణ స్పష్టం చేశారు. 

‘మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్‌కు సంబంధించి లోకల్, నాన్ లోకల్ వివాదం గురించి నేను పట్టించుకోను. కానీ ‘మా’ విషయంలో నేను సూటిగా ఓ ప్రశ్న అడుగుతున్నా.. ఇన్నేళ్లలో మనం ‘మా’ బిల్డింగ్‌ను ఎందుకు కట్టలేకపోయాం. ఇది గ్లామర్ ఇండస్ట్రీ. ఏమైనా సమస్యలు ఉంటే కూర్చొని మాట్లాడుకోవాలి. బహిరంగంగా చర్చించడం సరికాదు. తెలంగాణ ప్రభుత్వాన్ని అడిగితే భూమి ఇవ్వదా? తెలంగాణ సర్కార్‌తో రాసుకుపూసుకు తిరుగుతున్నారుగా? అడిగితే ఇవ్వరా? ఇంతకు ముందు ఫండ్ రైజర్స్ చేశారు. అమెరికాతోపాటు మరికొన్ని దేశాలకు ఫస్ట్ క్లాస్, ఎగ్జిక్యూటివ్, టాప్ క్లాస్‌లో వెళ్లొచ్చారు. కానీ ‘మా’ బిల్డింగ్‌కు వచ్చేసరికి ఏమైంది? ఆ డబ్బంతా ఏం చేశారు? ‘మా’ భవనాన్ని ఎందుకు కట్టలేకపోయారు? మంచు విష్ణు బిల్డింగ్ కడతాననడం మంచిదే. అందులో నేనూ భాగస్వామిని అవుతా. ఇండస్ట్రీలో ఉన్న పెద్దవాళ్లు డబ్బులు పెట్టుకోలేరా? అందరం కలిస్తే ఇంద్రభవనం, మయసభనే కట్టొచ్చు’ అని బాలయ్య పేర్కొన్నారు.