పాలస్తీనా- ఇజ్రాయెల్ మధ్య భీకర యుద్ధం నడుస్తోన్న క్రమంలో ప్రముఖ బాలీవుడ్ నటి నుష్రత్ భరుచ్చా ఇజ్రాయెల్లో చిక్కుకుపోయింది. ఈ విషయాన్ని ఆమె టీమ్ సభ్యుడు ఒకరు తెలిపారు. హైఫా ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్కు హాజరయ్యేందుకు అక్కడికి వెళ్లిన నుష్రత్ ఆ దేశంలోనే ఉండిపోయింది. దీంతో ఆమెతో తాము కనెక్ట్ కాలేకపోతున్నామని వెల్లడించాడు.
‘‘ఈ రోజు ముందు మధ్యాహ్నం 12.30 గంటల సమయంలో నటి నుష్రత్ నేలమాళిగలో సురక్షితంగా ఉన్నప్పుడు నేను చివరిసారిగా ఆమెను సంప్రదించగలిగాను. భద్రతా చర్యల దృష్ట్యా మరిన్ని వివరాలను వెల్లడించలేం. అయితే అప్పటి నుంచి మేం కనెక్ట్ కాలేకపోయాం. మేం నుష్రత్ను సురక్షితంగా భారతదేశానికి తిరిగి తీసుకురావడానికి ప్రయత్నిస్తున్నాం’’ అని ఆయన పేర్కొన్నారు.
నుస్రత్ బరుచ్చా చివరిసారిగా అకెలీ చిత్రంలో కనిపించారు. ప్రస్తుతం ఆమె 2021లో విడుదలైన చిత్రానికి సీక్వెల్గా తెరకెక్కుతోన్న చోరీ- 2 అనే హారర్ చిత్రంలో నటిస్తోంది. నుస్రత్ భరూచా 2010లో తెలుగులో ‘తాజ్ మహాల్’ అనే చిత్రంలో కనిపించింది. ఆ తర్వాత 2016లో తమిళంలో ‘వాలిబా రాజా’ చిత్రంలో నటించింది.