వైవిధ్యమైన పాత్రలతో నటుడిగా ప్రత్యేక గుర్తింపును అందుకున్న ప్రియదర్శి.. జాతిరత్నాలు, మల్లేశం, బలగం లాంటి చిత్రాలతో హీరోగానూ మెప్పించాడు. ఇప్పుడు ‘ఓం భీమ్ బుష్’ చిత్రంతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. శ్రీవిష్ణు, రాహుల్ రామకృష్ణలతో కలిసి నటించిన ఈ చిత్రానికి శ్రీహర్ష దర్శకుడు. యూవీ క్రియేషన్స్ సమర్పణలో వి సెల్యులాయిడ్, సునీల్ బలుసు నిర్మించిన సినిమా మార్చి 22న రిలీజ్ అవుతోంది.
ఈ సందర్భంగా ప్రియదర్శి మాట్లాడుతూ ‘హర్ష కథ చెప్పినప్పుడు చాలా ఇంటరెస్టింగ్గా అనిపించింది. కంప్లీట్ కామెడీ కాన్సెప్ట్తో ఫాంటసీ వరల్డ్ను క్రియేట్ చేశాడు. ముగ్గురు ఫ్రెండ్స్ కలిసి చేసే అల్లరే ఈ సినిమా. స్టైఫండ్, హాస్టల్ సదుపాయాల కోసం ఉస్మానియాలో పీహెచ్డీ చేద్దామనుకుంటాం. ఇందులో నా పాత్ర పేరు డాక్టర్ వినయ్ గుమ్మాడి. సైన్స్ను నమ్మే పాత్రలో నేను కనిపిస్తా. మిగతా ఇద్దరూ మంత్రాలు, తంత్రాలు అంటుంటారు.
మా మధ్య వచ్చే కాంబినేషన్ సీన్స్ చాలా హిలేరియస్గా ఉంటాయి. బయట కూడా మేం ఫ్రెండ్స్ కావడంతో చాలా సరదాగా షూటింగ్ సాగిపోయింది. నాకు జంటగా ఆయేషా ఖాన్ నటించింది. అలాగని రొమాంటిక్ సాంగ్స్ ఏమీ ఉండవు. ఎంటర్టైన్మెంట్తో పాటు బ్యూటిఫుల్ ఎమోషన్ కూడా ఉంటుంది. యూవీ లాంటి పెద్ద ప్రొడక్షన్లో నటించడం హ్యాపీ.
ఇక హీరోగా కంటే నన్ను నేను నటుడిగా చూసుకుంటా. హీరో ఇమేజ్ అంటే నాకు భయం. నటుడిగా అయితే చాలా ఫ్రీగా ఉంటా, ఎక్కువ అవకాశాలు వస్తాయి. వెరైటీ కూడా ఎక్కువ చేయొచ్చని నమ్ముతాను. ఇప్పుడు వరుస ఆఫర్స్ రావడం చూస్తుంటే లక్కీగా ఫీలవుతున్నా. నా కోసం మంచి పాత్రలు రాస్తున్న దర్శకులు దొరకడం నా అదృష్టం. అలాగే ప్రస్తుతం లీడ్ రోల్లో రెండు సినిమాలు చేస్తున్నా. ‘గేమ్ చేంజర్’ లో కూడా నటిస్తున్నా’ అని చెప్పాడు.