
స్వయంవరం, ప్రేమించు, హనుమాన్ జంక్షన్ లాంటి ఎన్నో సూపర్ హిట్ చిత్రాలతో హీరోయిన్గా మంచి గుర్తింపును తెచ్చుకున్న లయ.. నితిన్ హీరోగా నటించిన ‘తమ్ముడు’ చిత్రంతో రీ ఎంట్రీ ఇస్తున్నారు. వేణు శ్రీరామ్ దర్శకత్వంలో దిల్ రాజు నిర్మించిన ఈ సినిమా జులై 4న విడుదలవుతోంది.
ఈ సందర్భంగా లయ ఇలా ముచ్చటించారు. ‘‘రెండేళ్ల క్రితం ఇండియాకు వచ్చినప్పుడు నేను ఇచ్చిన ఇంటర్వ్యూస్ చూసిన డైరెక్టర్ వేణు ఈ సినిమా ఆఫర్ చేశారు. అప్పటికే తిరిగి అమెరికాకు వెళ్లిపోయాను. కానీ కథ నచ్చడంతో ఓకే చెప్పాను. ఇది నా రీ ఎంట్రీకి సరైన సినిమా అనిపించింది. యూఎస్లో జాబ్ మానేసి తిరిగొచ్చాను. క్యారెక్టర్ కోసం కొంచెం లావు పెరగాలని చెప్పడంతో స్వీట్స్ తిని బరువు పెరిగాను.
ఇందులో నా పాత్ర పేరు ఝాన్సీ కిరణ్మయి. తనొక స్ట్రిక్ట్ ఆఫీసర్. కుటుంబాన్ని చూసుకుంటూనే, ఆఫీసర్గా బాధ్యతలు నిర్వర్తించే పాత్ర. కెరీర్లో ఇప్పటివరకూ ఒక సాధారణ అమ్మాయి పాత్రల్లోనే నటించాను. ఇందులో మాత్రం స్ట్రాంగ్ ఉమెన్గా నటించే అవకాశం దక్కింది.
నాతో పాటు కథలో ప్రతి పాత్రకు ఇంపార్టెన్స్ ఉంది. ఫారెస్ట్ షెడ్యూల్లో టీమ్ అంతా చాలా కష్టపడాల్సి వచ్చింది. నితిన్తో వర్క్ చేయడం చాలా హ్యాపీగా అనిపించింది. తనకు అక్కగా నటించా. ఓ చిన్న పిల్లాడిలా మా అందరితో కలిసిపోయారు. పర్ఫార్మెన్స్ పరంగా ఇందులో తను చాలా మెచ్యూర్డ్గా కనిపిస్తారు. ఈ చిత్రంలోని బ్రదర్ అండ్ సిస్టర్ సెంటిమెంట్ కంప్లీట్ డిఫరెంట్గా ఉంటుంది’’.
‘‘కథకు డ్రైవింగ్ ఫోర్స్ లాంటి క్యారెక్టర్స్ వస్తే తల్లి, చెల్లి పాత్ర అయినా తప్పకుండా నటిస్తాను. కానీ థియేటర్ నుంచి బయటకు వచ్చేటప్పుడు ప్రేక్షకులకు నా క్యారెక్టర్ గుర్తుండాలి. సినిమాలు ఉన్నప్పుడు హైదరాబాద్లోనే ఉంటాను. ప్రస్తుతం శివాజీ గారితో ఒక సినిమా చేస్తున్నాను’’.