న్యూఢిల్లీ: అదానీపై ఉన్న లంచం, సెక్యూరిటీల మోసం ఆరోపణలను అమెరికా కోర్ట్ కొట్టేయడానికి అతని లాయర్ రాబర్ట్ జె. గియుఫ్రా జూనియర్ చాలా కష్టపడుతున్నారు. కేవలం 10 వారాల వ్యవధిలో దాదాపు 600 పేజీల లీగల్ సబ్మిషన్లు, ప్రెజెంటేషన్లు, నలుగురు అంతర్జాతీయ నిపుణుల నివేదికలను ప్రాసిక్యూటర్లకు సమర్పించారు.
నవంబర్ 2024 లో అదానీ గ్రూప్ సోలార్ కాంట్రాక్టుల కోసం భారత ప్రభుత్వ అధికారులకు 250 మిలియన్ డాలర్ల లంచం ఇచ్చేందుకు కుట్ర పన్నిందని అమెరికాలో కేసు నమోదైంది. ఈ ఏడాది మేలో డిపార్ట్మెంట్ ఆఫ్ జస్టిస్ (డీఓజే) ఈ కేసును కొట్టివేయాలని నిర్ణయించింది. కానీ, నూయార్క్ డిస్ట్రిక్ట్ జడ్జ్ నికోలస్ గరాఫిస్ ఈ నిర్ణయాన్ని తప్పు బట్టి, ఎందుకు ఉపసంహరించుకుంటున్నారో తెలియజేయాలని ఆదేశించారు.
దీనికి డీఓజే ఈ ఉల్లంఘనలు ప్రధానంగా భారతదేశంలో జరిగాయని, అధికార పరిధి లోపాలు, సాక్ష్యాల కొరత, ఇన్వెస్టర్లకు ఎలాంటి నష్టాలు వాటిల్లకపోవడం వల్లే కేసును విరమించుకుంటున్నట్లు ప్రాసిక్యూటర్లు, కోర్టుకు తెలిపింది.
