కాంగ్రెస్ సర్కార్​పై ఎందుకంత అక్కసు? : అద్దంకి దయాకర్

కాంగ్రెస్ సర్కార్​పై ఎందుకంత అక్కసు? : అద్దంకి దయాకర్

హైదరాబాద్, వెలుగు: తెలంగాణలో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వంపై ఎందుకంత అక్కసు అని వైఎస్సార్సీపీ నేత విజయ సాయి రెడ్డిని పీసీసీ జనరల్ సెక్రటరీ అద్దంకి దయాకర్ ప్రశ్నించారు. కాంగ్రెస్ సర్కార్ కూలిపోతుందంటూ ఇష్టమొచ్చినట్టు కామెంట్లు చేస్తున్నారని మండిపడ్డారు. ప్రధాని మోదీ దగ్గర ఎక్కువ మార్కులు వేసుకోవడానికే ఇలాంటి వ్యాఖ్యలు చేస్తున్నారా? అని విజయసా యి రెడ్డిని ప్రకటనలో అద్దంకి దయాకర్ నిలదీశారు. ‘‘ఏపీలో జగన్ ప్రభుత్వం కూలిపోతుందని మేమూ అంటాం. దానికి విజయసాయి రెడ్డి ఒప్పుకుంటారా? ఏపీలో కాంగ్రెస్​ను బలపర్చేందుకు షర్మిల ప్రయత్నిస్తున్నారు. అందుకే తెలం గాణ కాంగ్రెస్ సర్కార్​పై మీరంతా అక్కసు వెళ్లగక్కుతున్నరు’’అని విమర్శించారు.

తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చినందుకు వైఎస్సార్సీపీ లీడర్లు బాధపడుతున్నారని పేర్కొన్నారు. ‘‘వైఎస్సార్​ వారసత్వం అని చెప్పుకుంటున్న మీరు.. ఎవరి మోచేతి నీళ్లు తాగుతున్నారు? కాంగ్రెస్​ని విమర్శించే స్థాయా మీది? సొంత తల్లి, చెల్లిని ఆదరించలేని వాళ్లు.. వాళ్ల ప్రభుత్వం ఎప్పటికీ ఉండాలనుకుంటున్నరు. సమాజాన్ని ప్రేమించే తెలంగాణ కాంగ్రెస్ సర్కార్ ఏమో కూలిపోవాలని అనుకుంటున్నరు. ఇలాంటి పిచ్చి పిచ్చి ఆలోచనలు విజయసాయి రెడ్డి మానుకోవాలి’’అని దయాకర్ మండిపడ్డారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు చేయడంతోనే ఏపీకి జగన్ సీఎం అయ్యారన్న విషయం మరిచిపోవద్దని పేర్కొన్నారు. ‘‘వచ్చే లోక్​సభ ఎన్నికల్లోనూ కాంగ్రెస్ పార్టీనే ప్రజలు ఆశీర్వదిస్తరు. ఏపీ సర్కార్ వైఫల్యాల కారణంగా అక్కడి ప్రజలు చాలా నష్టపోతున్నారు’’అని విమర్శించారు.