- హరీశ్ తీరుపై కాంగ్రెస్ ఎమ్మెల్సీ అద్దంకి దయాకర్ ఫైర్
హైదరాబాద్, వెలుగు: అధికారులను బెదిరించే తీరును హరీశ్ రావు మానుకోవాలని కాంగ్రెస్ ఎమ్మెల్సీ అద్దంకి దయాకర్ ఫైర్ అయ్యారు. హరీశ్ మతిభ్రమించి మాట్లాడుతున్నారని, అధికారం లేదనే అక్కసు ఆయనలో కనిపిస్తుందని మండిపడ్డారు. ఈ మేరకు మంగళవారం ఆయన హైదరాబాద్లో మీడియాకు ఒక ప్రకటన విడుదల చేశారు.
తెలంగాణలో నాశనం అయిన పార్టీతో అధికారంలోకి వస్తామని హరీశ్కలలు కంటున్న తీరు ఆయన మానసిక పరిస్థితికి అద్దం పడుతుందని తెలిపారు. తెలంగాణలో బీఆర్ఎస్కు ఇక మనుగడ లేదని, అందుకే బీజేపీతో పొత్తుకు హరీశ్ వెంపర్లాడుతుండని విమర్శించారు. అధికారులు తమ పరిధిలోనే పనిచేస్తున్నారని, బీఆర్ఎస్ ప్రభుత్వంలా తాము అధికారులను వాడుకోవడం లేదని స్పష్టం చేశారు. మరోసారి అధికారులను బెదిరించే రీతిలో హరీశ్ మాట్లాడితే సహించేది లేదని హెచ్చరించారు.

