యాప్స్ కు బానిసలవుతున్నరు

యాప్స్ కు బానిసలవుతున్నరు

హైదరాబాద్, వెలుగు: ప్రపంచం మొత్తం నేడు మొబైల్ రూపంలో అరచేతిలోనే ఉంది. అవసరాలకు, కేవలం సరదాలకు వాడుకోవాల్సిన మొబైల్ యాప్స్ కు జనాలు బానిసలుగా మారుతున్నారు. కేవలం యువతే కాదు పెద్ద వారు కూడా ఇలాంటి ఎన్నో యాప్ లకు బానిసలవుతున్నారు. టిక్ టాక్, పబ్జీ గేమ్స్, కొత్తగా ఫేస్ యాప్, హలోయాప్ ఇలా ఉన్న యాప్ లకు తోడుగా రోజు రోజుకు మనిషిని బానిసగ చేసుకునేందుకు వందల సంఖ్యలో పెరిగిపోతూనే ఉన్నాయి. ప్రస్తుతం డ్రగ్స్ లాగే మార్కెట్ లోకి వస్తున్న రోజుకో కొత్త యాప్ జనాలకు వ్యసనంగా మారాయంటున్నారు నిఫుణులు.

రిస్కీ ఫీట్లతో ప్రాణాలు కోల్పోతున్నారు

టిక్ టాక్ లో లైకులు, వ్యూలు రాకపోయినా… పబ్జీలో చికెన్ డిన్నర్ దొరకకపోయినా… వాట్సాప్ లో స్టేటస్ కు వ్యూలు లేకపోయినా జనాలు ఎంతగానో ఒత్తిడికి గురవుతున్నారు. తాము జీవితంలో ఏదో కోల్పోయినట్లు భావిస్తున్నారు. మరికొందరు వీడియోల కోసం ప్రాణాలమీదకు వచ్చే రిస్కీ ఫీట్లు చేస్తూ ఒక్కోసారి ప్రాణాలు కూడా కోల్పోతున్నారు.

సమయం వృథా

టిక్ టాక్, పబ్జీ వంటి యాప్ లకు యువత, ఉద్యోగులు, విద్యార్థులు బానిసలై తమ విలువైన సమయాన్ని వృథా చేసుకుంటున్నారు. ఉద్యోగులు తమ ఉద్యోగ భాద్యతలకు, ప్రజల అవసరాలకు కేటాయించాల్సిన సమయాన్ని వీటికి ఉపయోగించి టైంపాస్ చేస్తున్నారు. ఈ మధ్య కాలంలో ఖమ్మం కార్పొరేషన్ కార్యాలయంలో విధులను పక్కనబెట్టి టిక్‌ టాక్‌ వీడియోలు చేసిన ఉద్యోగులను అధికారులు వారిని విధుల నుంచి తప్పించారు.

ప్రైవసీకి తిప్పలు…

తాము చేసే రోజూ వారి పనులను కొందరు నిమిష నిమిషానికి తమ వాట్సాప్, ఫేస్ బుక్, టిక్ టాక్ వంటి వాటితో సోషల్ మీడియాలో అప్ లోడ్ చేసేస్తున్నారు. దీంతో వారికి తెలియకుండానే వారు ప్రమాదాల్లో పడుతున్నారు. వీరు అప్ లోడ్ చేసే ఫోటోలను కొందరు పడని వారు మార్ఫింగ్ చేసి నెట్ లో అప్లోడ్ చేస్తూ బెదిరిస్తున్నారు.