
న్యూఢిల్లీ, వెలుగు: ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితపై సీబీఐ దాఖలు చేసిన అడిషనల్ చార్జిషీట్ ను ట్రయల్ కోర్టు పరిగణనలోకి తీసుకుంది. ఈ కేసులో ఈ ఏడాది మార్చి 15న కవితను ఈడీ అరెస్టు చేసింది. ఆమె తిహార్ జైలులో ఉండగానే ఏప్రిల్ 11న సీబీఐ ఆమెను అదుపులోకి తీసుకుంది. కోర్టు అనుమతితో కవితను కస్టడీలోకి తీసుకుని విచారించింది. ఆ తర్వాత ఆమెతో పాటు మరో నలుగురిపై సీబీఐ అదనపు చార్జిషీటును దాఖలు చేసింది.
అయితే, సీబీఐ దాఖలు చేసిన అడిషనల్ చార్జిషీటు సరిగా లేదని, తనకు బెయిల్ ఇవ్వాలని కవిత మరోసారి ట్రయల్ కోర్టును ఆశ్రయించారు. ఈ పిటిషన్ పై సోమవారం విచారణ జరిపిన స్పెషల్ జడ్జి కావేరి బవేజా... ఆ బెయిల్ పిటిషన్ పై ఆగస్టు 5న తదుపరి విచారణ చేపడతామని స్పష్టం చేశారు. అనంతరం లిక్కర్ స్కామ్ కేసులో సీబీఐ దాఖలు చేసిన అడిషనల్ చార్జిషీటును పరిగణనలోకి తీసుకుంటున్నామని బవేజా వెల్లడించారు. ఈనెల 26న ఆ చార్జిషీటుపై తదుపరి విచారణ చేపడతామని తెలిపారు.