ధాన్యం కొనుగోలు కేంద్రాలను ప్రారంభించాలి : మహేందర్​జీ

ధాన్యం కొనుగోలు కేంద్రాలను ప్రారంభించాలి :  మహేందర్​జీ

ములుగు, వెలుగు: ఎన్నికల కోడ్ అమలులో ఉన్నందున నిబంధనలకు లోబడి ఏప్రిల్ 1లోగా ధాన్యం కొనుగోలు కేంద్రాలను ప్రారంభించాలని ములుగు అడిషనల్​కలెక్టర్ మహేందర్​జీ సూచించారు. గురువారం కలెక్టరేట్ లో జిల్లా సివిల్ సప్లై శాఖ ఆధ్వర్యంలో యాసంగి ధాన్యం కొనుగోలుపై శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా అడిషనల్​కలెక్టర్ మాట్లాడుతూ కొనుగోలు కేంద్రాల్లో రైతులకు ఎలాంటి ఇబ్బందులు రాకుండా చూసుకోవాలన్నారు.

రైతులు ప్రభుత్వ కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం విక్రయించి, ఏ రకం ధాన్యానికి రూ.2,203, సాధారణ రకానికి రూ.2,183ను మద్దతు ధర పొందాలని సూచించారు. జిల్లా సరిహద్దుల్లో చెక్​పోస్ట్​లు ఏర్పాటు చేశామని పొరుగు రాష్ర్టం నుంచి ఇక్కడికి ధాన్యం రాకుండా తనిఖీలు నిర్వహించాలన్నారు. సివిల్​సప్లై అధికారి రాంపతి మాట్లాడుతూ కొనుగోలు కేంద్రాల్లో ఎలక్ట్రానిక్​ కాంటాలు మాత్రమే వాడాలని సూచించారు.

కార్యక్రమంలో డీఆర్​డీఏ పీడీ శ్రీనివాస్ కుమార్, జిల్లా వ్యవసాయ అధికారి విజయ్ చంద్ర, డీసీవో సర్దార్ సింగ్, గిరిజన సహకార సంస్థ జిల్లా మేనేజర్ ప్రతాపరెడ్డి, మార్కెటింగ్ ఆఫీసర్ సుచరిత, అధికారులు, ట్రాన్స్​పోర్ట్​ కాంట్రాక్టర్లు, రైస్ మిల్లర్లు తదితరులు
 పాల్గొన్నారు.