గ్యాస్​ లీకేజీపై అలర్ట్ గా ఉండాలి

గ్యాస్​ లీకేజీపై అలర్ట్ గా ఉండాలి
  •     భద్రాద్రికొత్తగూడెం అడిషనల్​ కలెక్టర్ రాంబాబు 

అశ్వాపురం వెలుగు :  స్థానిక హెవీ వాటర్ ప్లాంట్ లో వినియోగించే హైడ్రోజన్ సల్ఫైడ్ విషవాయువు లీకేజీ పై అలర్ట్​గా ఉండాలని కర్మాగారం యాజమాన్యానికి  భద్రాద్రి కొత్తగూడెం అడిషనల్​ కలెక్టర్ కె.రాంబాబు సూచించారు. గురువారం అశ్వాపురంలోని గౌతమి నగర్ కాలనీలో హెవీ వాటర్ ప్లాంట్ ఆఫ్ సైట్ ఎమర్జెన్సీ సబ్ ప్లాన్ కమిటీ సమావేశం నిర్వహించారు.

ఈ సందర్భంగా అడిషనల్​ కలెక్టర్​ మాట్లాడుతూ విషవాయువు లీకేజీ పై యాజమాన్యం మాక్ డ్రిల్ నిర్వహించడం మంచి పరిణామమన్నారు. విషవాయువు లీకేజీ, దానివల్ల కలిగే హాని గురించి కర్మాగారం చుట్టుపక్కల గ్రామాల్లోని ప్రజల్లో అవగాహన కల్పించాలన్నారు. ఆఫ్ సైట్ ఎమర్జెన్సీ జోన్ పరిధిలోని గ్రామాలకు రహదారి, తాగునీరు, విద్యా సౌకర్యం, సేఫ్టీ షెల్టర్లు అందించాలన్నారు.

అమ్మగారిపల్లిలో హెవీ వాటర్ ప్లాంట్ అధికారులు మాక్​ డ్రిల్ నిర్వహించారు. సమావేశంలో కర్మాగారం జనరల్ మేనేజర్ జగ్గారావు, డిప్యూటీ జనరల్ మేనేజర్లు జి.శ్రీనివాస్ విశ్వనాథ్. హెచ్​డీ శర్మ చీఫ్ అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ జి.వేణు, పారిశ్రామిక సంబంధాల అధికారి లత, సీఐఎస్ఎఫ్ డిప్యూటీ కమాండెంట్ యోహాన్, హెవీ వాటర్ ప్లాంట్ ఎంప్లాయీస్ అసోసియేషన్ ప్రెసిడెంట్ కొరపాటి శ్రీనివాసరావు, తహసీల్దార్ ఏ.నరేశ్​, సీఐ జి.రవీందర్, వివిధ ప్రభుత్వ శాఖల అధికారులు పాల్గొన్నారు.