కారం పొడి ప్యాకెట్లలో నల్లమందు

కారం పొడి ప్యాకెట్లలో నల్లమందు
  • రాజస్థాన్ నుంచి సిటీకి తరలిస్తున్న వ్యాపారి అరెస్ట్
  • రూ. 10 లక్షల విలువైన 2.25 కిలోల ఓపీయం స్వాధీనం

ఎల్​బీనగర్/ఆదిబట్ల, వెలుగు: రాజస్థాన్ నుంచి సిటీకి ఓపీయం (నల్లమందు)ను తరలిస్తున్న వ్యాపారిని మహేశ్వరం జోన్ ఎస్ వోటీ, ఆదిబట్ల పోలీసులు అరెస్ట్ చేశారు. బుధవారం నేరెడ్ మెట్ లోని రాచకొండ కమిషనరేట్ ఆఫీసులో  మీడియా సమావేశంలో సీపీ డీఎస్ చౌహాన్ వివరాలు వెల్లడించారు. రాజస్థాన్ లోని బిల్వారా జిల్లాకు చెందిన మహేందర్ సింగ్(40) పదేండ్ల కిందట సిటీకి వచ్చి రంగారెడ్డి జిల్లా తుర్కయంజాల్ లో ఉంటూ బంగారు తాకట్టు వ్యాపారం చేస్తున్నాడు. 

లాక్ డౌన్ లో నష్టాలు రావడంతో డ్రగ్స్ కు బానిసైన మహేందర్ సింగ్ రాజస్థాన్ లో ఓపీయంను కొని దాన్ని కారం పొడి, సజ్జలు, ఇతర కిరాణా స్టోర్ సామగ్రి మధ్యలో పెట్టి సిటీకి తెచ్చి అమ్మేవాడు. సమాచారం అందుకున్న మహేశ్వరం జోన్ ఎస్ వోటీ, ఆదిబట్ల పోలీసులు మహేందర్ ఇంటిపై దాడి చేసి అదుపులోకి తీసుకున్నారు. రూ.10 లక్షల విలువైన 2.25 కిలోల ఓపీఎం, సెల్​ఫోన్​ను స్వాధీనం చేసుకున్నారు. నిందితుడిని రిమాండ్​కు తరలించారు.