సానిటరీ నాప్కిన్ తయారీ యూనిట్ ప్రారంభం .. మెప్మా ఆధ్వర్యంలో ప్రారంభించిన కలెక్టర్

సానిటరీ నాప్కిన్ తయారీ యూనిట్ ప్రారంభం .. మెప్మా ఆధ్వర్యంలో ప్రారంభించిన కలెక్టర్

ఆదిలాబాద్, వెలుగు: ఆదిలాబాద్​ జిల్లా కేంద్రంలోని పాత మున్సిపల్ కార్యాలయంలో ఎకో ప్యూర్ సానిటరీ నాప్కిన్ ప్యాడ్స్ తయారీ యూనిట్ ను బుధవారం కలెక్టర్ రాజర్షి షా ప్రారంభించారు. అనంతరం ప్యాడ్స్​ను విద్యార్థులకు అందజేశారు. మెప్మా ఆధ్వర్యంలో అన్ని శాఖల సహకారంతో ఈ యూనిట్​ను ప్రారంభించామని, ఇక్కడ సానిటరీ పాడ్స్ తయారు చేసి జిల్లాలోని స్కూళ్లకు పంపించనున్నట్లు తెలిపారు.అమ్మాయిలకు పీరియడ్స్ వచ్చే సమయంలో వారికి తగు సూచనలు, సలహాలు ఇవ్వాలని తల్లిదండ్రులు, డాక్టర్లను కోరారు. ఈ సమయంలో రక్తహీనత బారిన పడకుండా జాగ్రత్తలు పాటించాలని విద్యార్థులకు సూచించారు. ఐరన్, ఫోలిక్ యాసిడ్ టాబ్లెట్స్ తప్పకుండా వేసుకోవాలని సూచించారు. 

మిల్లెట్ బిస్కెట్ యూనిట్ ప్రారంభం

షుగర్, మైదా రహిత మిల్లెట్ బిస్కెట్స్ యూనిట్​తోపాటు, లడ్డు తయారీ  కేంద్రాన్ని కలెక్టర్ గాంధీనగర్​లో  ప్రారంభించారు. 22 రకాల మిల్లెట్ బిస్కెట్స్​ను ఆయిల్ వాడకుండా డ్రైఫ్రూట్స్, పల్లి, నువ్వులు, సోయా గింజలు ఇతర మిల్లెట్స్​తో తయారు చేస్తారని కలెక్టర్​ తెలిపారు.  

పీఎం జన్మన్ పథకం ద్వారా వసతులు

పీఎం జన్మన్ పథకం ద్వారా గిరిజన గ్రామాల్లో ఇండ్లు, తాగునీరు, విద్య, ఆరోగ్యం, రహదారులు వంటి ప్రాథమిక మౌలిక వసతులు కల్పించనున్నట్లు కలెక్టర్ రాజర్షి షా తెలిపారు. భీంపుర్ మండలం గుంజాల గ్రామంలో రైతు సదస్సులు, జన్మన్ క్యాంప్​లను పరిశీలించారు. జూన్ 30 వరకు గ్రామాల్లో క్యాంపులు నిర్వహించి గిరిజనులు, సామాజికంగా వెనుకబడిన వర్గాల వివరాలను నమోదుకు దరఖాస్తులు స్వీకరిస్తున్నట్లు పేర్కొన్నారు.