ఆదిత్య-ఎల్ 1 రాకెట్ విజయవంతంగా సూర్యుడి వైపు దూసుకెళ్తోంది. ఆదిత్య ఎల్ 1 ను నిర్దేశిత భూ కక్ష్యలోకి ప్రవేశపెట్టిన ఇస్రో..సెప్టెంబర్ 3వ తేదీన తొలి భూ కక్ష్య పెంపు విన్యాసాన్ని విజయవంతంగా చేపట్టింది. ఈ మేరకు ఇస్రో ప్రకటించింది. బెంగళూరులోని ఇస్రో టెలీమెట్రీ, ట్రాకింగ్ అండ్ కమాండ్ నెట్వర్క్ నుంచి తొలి భూ కక్ష్య పెంపు విన్యాస ప్రక్రియను చేపట్టినట్లు తెలిపింది. దీంతో ప్రస్తుతం ఆదిత్య-ఎల్1 రాకెట్..245× 22,459 కి. మీ దూరంలోని కక్ష్యలోకి చేరుకుంది. ఆదిత్య ఎల్ 1 మిషన్ విజయవంతంగా పనిచేస్తోందని... రెండో భూకక్ష్య పెంపు విన్యాసాన్ని సెప్టెంబరు 5న నిర్వహిస్తామని ఇస్రో వెల్లడించింది.
సెప్టెంబర్ 2వ తేదీన ఆదిత్య-ఎల్1 ఉపగ్రహంతో పీఎస్ఎల్వీ-సి57 రాకెట్ నింగిలోకి దూసుకెళ్లింది. 63 నిమిషాల సుదీర్ఘ ప్రయాణం అనంతరం 1480.7 కిలోల ఉపగ్రహాన్ని భూ కక్ష్యలో ప్రవేశపెట్టింది ఇస్రో. 16 రోజుల పాటు భూ కక్ష్యల్లోనే తిరగనున్న ఆదిత్య-ఎల్1..అనంతరం భూమికి 15 లక్షల కి.మీ. దూరంలో ఉన్న నిర్దేశిత ఎల్1 బిందువు దిశగా సుదీర్ఘ ప్రయాణాన్ని ప్రారంభిస్తుంది.