సెల్ఫీలు పంపిస్తున్న ఆదిత్య ఎల్1 : భూమి -.. చంద్రుడి మధ్య ఉన్న శాటిలైట్

సెల్ఫీలు పంపిస్తున్న ఆదిత్య ఎల్1 : భూమి -.. చంద్రుడి మధ్య  ఉన్న శాటిలైట్

సెప్టెంబర్ 2వ తేదీ సూర్యుడి తన ప్రయాణాన్ని ప్రారంభించిన ఆదిత్య ఎల్ 1 శాటిలైట్.. ఇప్పుడు భూమి - చంద్రుడి మధ్య ఉంది. ఈ క్రమంలోనే సెప్టెంబర్ 7వ తేదీ ఉదయం.. భూమి.. చంద్రుడు ఇదిగో.. ఇలా ఉన్నారంటూ సెల్ఫీలు తీసుకుని పంపించింది. భూమి ఓ వైపు చీకటిగా.. మరో వైపు వెలుగులో ఉండగా.. చంద్రుడు మాత్రం నక్షత్రం సైజులో ఉన్నాడు. సూర్యడు వైపు తన ప్రయాణాన్ని కొనసాగిస్తూనే.. మధ్య ఇలా సెల్ఫీలు తీసుకుని పంపిస్తుంది ఆదిత్య ఎల్ 1.. ఈ ఫొటోలను ఇస్రో రిలీజ్ చేసింది.

ప్రస్తుతం ఆదిత్య-ఎల్1 శాటిలైట్ భూమి ఎగువ కక్ష్యలోని 282 కి.మీ x 40225 కి.మీ ఎత్తులో తన ప్రయాణాన్నికొనసాగిస్తోంది. ఇప్పటికే ఆదిత్య ఎల్ 1 శాటిలైట్ కు సంబంధించి రెండు భూకక్ష్య పెంపు విన్యాసాలను విజయవంతంగా ఇస్రో చేపట్టింది. ఇక  మూడో విన్యాసాన్ని సెప్టెంబరు 10న తెల్లవారుజాము 2.30 గంటలకు నిర్వహించనుంది. లాంచింగ్ ప్యాడ్ నుంచి రాకెట్ బయలుదేరిన 16 రోజుల్లో మొత్తం ఐదు విన్యాసాలను ఆదిత్య ఎల్ 1 పూర్తి చేసుకోనుంది. ఆ తర్వాత  సూర్యుడి లాగ్రాంజ్ పాయింట్ దిశగా ఆదిత్య-ఎల్ 1 ప్రయాణిస్తుంది. అనంతరం 110 రోజులకు ఇస్రో నిర్దేశిత ప్రదేశానికి ఆదిత్య ఎల్ 1 చేరుకుంటుంది. 

ALSO READ: జాబిల్లిపైకి జపాన్.. నింగిలోకి హెచ్‌-2ఏ రాకెట్‌

ఆదిత్య ఎల్ 1 మొత్తం 125 రోజులు ప్రయాణించి..ఆ త తర్వాత 15 లక్షల కిలోమీటర్ల దూరంలో ఉన్న సూర్యుడి లాగ్రాంజ్ పాయింట్  వద్దకు చేరుకుంటుంది. అక్కడ నుంచి సూర్యుడిపై తన అధ్యయనాన్ని మొదలు పెడుతుంది. ఈ అధ్యయనంలో భాగంగా ఆదిత్య ఎల్ 1  నిమిషానికి ఒక  ఫోటోను తీసి ఇస్రోకు పంపనుంది. ఆదిత్య ఎల్ 1 మొత్తం ఐదేళ్ల పాటు  సూర్యుడి గురించి పరిశోధనలను చేయనుంది.  ఇందులోని మొత్తం ఏడు పేలోడ్లలో ఐదింటిని ఇస్రో.. మిగతా రెండింటిని దేశంలోని ప్రతిష్టాత్మక విద్యా సంస్థల సహకారంతో అభివృద్ధి చేశారు. 

ఆదిత్య ఎల్ 1 మిషన్ను సెప్టెంబర్ 2వ తేదీన నెల్లూరు శ్రీహరికోటలోని సతీశ్‌ ధావన్‌ స్పేస్‌ సెంటర్‌ నుంచి  ఉదయం 11.50 గంటలకు పీఎస్‌ఎల్‌వీ-సి57 వాహకనౌక ద్వారా నింగిలోకి ప్రయోగించారు ఇస్రో శాస్త్రవేత్తలు. మొత్తం  63 నిమిషాల పాటు ప్రయాణించిన తర్వాత 1480.7 కిలోల ఉపగ్రహం రాకెట్ నుంచి విడిపోయి భూ ఎగువ కక్ష్యలోకి ఆదిత్య ఎల్ 1 చేరింది.