ప్రాజెక్టుల అప్పగింతపై సమావేశం వాయిదా

ప్రాజెక్టుల అప్పగింతపై సమావేశం వాయిదా

 హైదరాబాద్, వెలుగు : కేఆర్ఎంబీకి శ్రీశైలం, నాగార్జున సాగర్​ప్రాజెక్టుల అప్పగింతపై శుక్రవారం ఢిల్లీలో నిర్వహించాల్సిన సమావేశం వాయిదా వేస్తున్నామని కేంద్ర జలశక్తి శాఖ ఏపీ, తెలంగాణ ఇరిగేషన్​సెక్రటరీలకు సమాచారం ఇచ్చింది. జనవరి 17న నిర్వహించిన సమావేశంలో నెల రోజుల్లోగా రెండు ప్రాజెక్టుల్లోని 15 కంపోనెంట్లను బోర్డు నిర్వహణకు అప్పగించాలని కేంద్రం ఆదేశించింది. ఈ ప్రక్రియపై చర్చేందుకు శుక్రవారం సమావేశం ఏర్పాటు చేయగా తాము మీటింగ్​కు రాలేమని తెలంగాణ ఇరిగేషన్​సెక్రటరీ రాహుల్​బొజ్జా కేంద్ర జలశక్తి శాఖ కార్యదర్శి దేబశ్రీ ముఖర్జీకి లేఖ రాశారు.

 తెలంగాణ సీఎం ఈ నెల 13న అసెంబ్లీలో కృష్ణా ప్రాజెక్టులు, కేఆర్ఎంబీ, కేంద్ర జలశక్తి శాఖతో సమావేశాలకు సంబంధించిన వైట్​పేపర్​ప్రవేశపెట్టారని తెలిపారు. దీనిపై అసెంబ్లీలో చర్చ జరగాల్సి ఉందని చెప్పారు. ఈ పరిస్థితుల్లో తాము సమావేశానికి హాజరుకాలేమని స్పష్టం చేశారు. ఈ నేపథ్యంలోనే సమావేశాన్ని కేంద్రం వాయిదా వేసింది.