గండిపేట, వెలుగు: న్యాయవాది మహ్మద్ ఖదీర్ హత్య కేసులో ఏడుగురు నిందితులను అత్తాపూర్ పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు. సోమవారం సాయంత్రం అత్తాపూర్ పోలీస్ స్టేషన్లో డీసీపీ శ్రీనివాస్, ఏసీపీ శ్రీనివాస్, సీఐ నాగేశ్వరరావు వివరాలను వెల్లడించారు. సులేమాన్నగర్కు చెందిన మహ్మద్ ఖదీర్ న్యాయవాదిగా పని చేస్తూ రియల్ ఎస్టేట్ వ్యాపారం నిర్వహించేవాడు. 14 ఏళ్ల క్రితం తబస్సుం ఫాతిమాను వివాహం చేసుకోగా, ఇటీవల బండ్లగూడకు చెందిన సమీరాబేగంను రెండో వివాహం చేసుకున్నాడు. దీంతో సొంత బామ్మర్దులు అనీఫ్, కరీంలు మరో ఐదుగురు స్నేహితులతో కలిసి హత్యకు కుట్ర పన్నారు. ఆన్లైన్ సర్వీస్ సెంటర్లో ఖదీర్ ఉన్నట్లు తెలుసుకుని అక్కడికి వెళ్లారు. కత్తులు, ఇనుప రాడ్లతో విచక్షణారహితంగా దాడి చేసి హత్య చేశారు. ఈ కేసులో అనీఫ్, కరీం, మహ్మద్ హర్షత్, మహ్మద్ ముస్తాక్, అఖిల్ పాషా, మహ్మద్ అబ్దుల్ కరీం, షేక్ ఇస్మాయిల్ను అరెస్ట్ చేశారు. తొమ్మిది సెల్ఫోన్లు, మూడు బైక్లు, రెండు కత్తులు, ఒక ఐరన్ రాడ్ను స్వాధీనం
చేసుకున్నారు.
