ప్రధానికి వ్యతిరేకంగా పోస్టర్లు.. దేశ వ్యాప్తంగా అంటించాలని ఆప్ నిర్ణయం

ప్రధానికి వ్యతిరేకంగా పోస్టర్లు.. దేశ వ్యాప్తంగా అంటించాలని ఆప్ నిర్ణయం

బీజేపీ, ఆప్ కి మధ్య పోస్టర్ వార్ కొనసాగుతోంది. మొన్నటివరకు ఢిల్లీకే పరిమితమైన ఈ వార్.. ఇప్పుడు దేశవ్యాప్తంగా విస్తరింపజేసేందుకు ఆప్ ప్రయత్నిస్తోంది. అందులో భాగంగా ఈ రోజు మార్చి 30న ప్రధాని మోడీకి వ్యతిరేకంగా అన్ని భాషల్లోనూ పోస్టర్లు అంటించాలని ఆప్ నిర్ణయించింది. ఈ పోస్టర్లు మొత్తం 11 భాషల్లో ప్రింట్ చేయిస్తున్నట్టుగా వెల్లడించింది. కొత్తగా ప్రచురిస్తున్న ఈ పోస్టర్లపై "మోడీ హఠావో, దేశ్ బచావో" (మోడీని వెళ్లగొట్టండి, దేశాన్ని రక్షించండి) అనే నినాదాలు ఉండడం గమనార్హం. 

అంతకుముందు ప్రధాని మోడీకి వ్యతిరేకంగా ఢిల్లీలోని పలు ప్రాంతాల్లో గోడలు, విద్యుత్ స్తంభాలపై ఆప్ పోస్టర్లు అంటించడం దేశ వ్యాప్తంగా కలకలం రేపింది. ఆ తర్వాత "కేజ్రీవాల్ హఠావో, ఢిల్లీ బచావో" పేరుతో ఆప్ కు వ్యతిరేకంగా పోస్టర్లు అంటించి బీజేపీ ప్రీతీకారం తీర్చుకుంది. దీంతో ఆప్, బీజేపీ మధ్య  పోస్టర్ వార్ మొదలైంది. మోడీకి వ్యతిరేకంగా పలు నినాదాలతో పోస్టర్లు అంటించినందుకు గానూ ఇద్దరు ప్రింటింగ్ ప్రెస్ యజమానులతో సహా నలుగురిని పోలీసులు అరెస్టు చేయగా, 49 మందిపై ఎఫ్ఐఆర్ లు నమోదయ్యాయి. 

ఈ అరెస్టులపై ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ స్పందిస్తూ.. స్వాతంత్య్రోద్యమ సమయంలో ఈ తరహా వ్యతిరేకంగా పోస్టర్లు వేసిన వారిని బ్రిటిష్ వారు కూడా అరెస్టు చేయలేదన్నారు. స్వాతంత్ర్యానికి ముందు సైతం స్వాతంత్ర్య సమరయోధులు పోస్టర్లు అంటించేవారని, బ్రిటిష్ వారు వారిపై ఎలాంటి ఎఫ్‌ఐఆర్‌లు లేదా చర్యలు తీసుకోలేదని కేజ్రీవాల్ అన్నారు. "బ్రిటీష్ పాలనలో భగత్ సింగ్ చాలా పోస్టర్లు అతికించారు, అతనిపైనా ఒక్క ఎఫ్ఐఆర్ నమోదు చేయలేదు" అని కేజ్రీవాల్ మండిపడ్డారు.