
- పహల్గాం దాడి నిందితుల స్థావరాలను మన సైన్యం ధ్వంసం చేసింది: మోదీ
- మన మహిళల సిందూరం పవర్ను పాక్ చవిచూసింది
- ఆపరేషన్ సిందూర్ ముగియలే..బిహార్లోని కరకట్లో ర్యాలీ
పాట్నా: ఆపరేషన్ సిందూర్ అనేది భారత అమ్ములపొదిలోని ఒక అస్త్రం మాత్రమేనని, ఉగ్రవాదంపై యుద్ధం ముగియలేదని ప్రధాని నరేంద్ర మోదీ తెలిపారు. మరోసారి ఉగ్రవాదం అనే పాము బుసలుకొడితే.. పుట్టలోంచి లాగి దాన్ని తొక్కేస్తామని హెచ్చరించారు. శుక్రవారం బిహార్లోని కరకట్లో నిర్వహించిన ఎన్నికల ర్యాలీలో మోదీ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..
పాకిస్తాన్లో ఉంటూ పహల్గాం ఉగ్రదాడికి మాస్టర్ప్లాన్ వేసినవారి స్థావరాలను భారత బలగాలు ధ్వంసం చేశాయని చెప్పారు. గత నెలలో మధుబని జిల్లాలో నిర్వహించిన ర్యాలీలో ఆయన చెప్పిన విషయాలను గుర్తుచేశారు. ‘‘పహల్గాంలో ఉగ్రదాడి జరిగిన తర్వాత నేను బిహార్కు వచ్చాను. నేరస్తులకు వారు కలలో కూడా ఊహించని శిక్ష పడుతుందని హామీ ఇచ్చాను. ఆ హామీ నెరవేర్చాకే ఈ రోజు బిహార్లో అడుగుపెట్టాను’’ అని పేర్కొన్నారు.
పాక్ ఉగ్రవాదులను మోకాళ్లపై నిలబెట్టాం
మన దేశ మహిళల సిందూర్ శక్తిని పాకిస్తాన్ చవిచూసిందని, మన పవర్ ప్రపంచానికి తెలిసిందని మోదీ అన్నారు. పాకిస్తాన్ సైన్యం రక్షణలో ఉగ్రవాదులు సురక్షితంగా ఉంటామని భావించారని, కానీ వారిని మోకాళ్లపై నిలబెట్టామని చెప్పారు. ‘‘ఇది నయా భారత్. రాముడి బాటలో ఒక్కసారి వాగ్దానం చేస్తే.. దాన్ని నెరవేర్చి తీరుతాం” అని పేర్కొన్నారు.
జమ్మూ కాశ్మీర్లో దేశం కోసం పోరాడుతూ వీరమరణం పొందిన సరన్ జిల్లావాసి, బీఎస్ఎఫ్ సబ్-ఇన్స్పెక్టర్ మహ్మద్ ఇంతియాజ్ను మోదీ గుర్తు చేసుకున్నారు. 1857 తిరుగుబాటు వీరులలో ఒకరిగా పరిగణించే బిహార్లోని జగదీశ్పూర్ రాజు వీర్ కున్వర్ సింగ్ పరాక్రమంతో ఇంతియాజ్ త్యాగాన్ని పోల్చారు.
మావోయిస్టులపై కఠిన చర్యలు తీసుకున్నం
దేశం సరిహద్దు అవతల, లోపల ఉండే శత్రువులను తుదముట్టిస్తామని మోదీ తెలిపారు. హింస, అశాంతిని వ్యాప్తిచేస్తున్న వారిపై తాము చేస్తున్న పోరాటానికి బిహార్ ప్రజలు సాక్షిగా నిలిచారని అన్నారు. గతంలో నక్సల్ ప్రభావిత గ్రామాలకు ఆసుపత్రులు, మొబైల్ టవర్లు ఉండేవి కావని తెలిపారు.
తాము 2014లో అధికారంలోకి వచ్చాక మావోయిస్టులపై కఠిన చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. నక్సల్స్ ప్రభావిత జిల్లాల సంఖ్య 125 నుంచి కేవలం 18కి తగ్గిందని తెలిపారు. ఇక్కడ ప్రభుత్వం రోడ్లు నిర్మిస్తున్నదని, ఉద్యోగాలను సృష్టిస్తున్నదని పేర్కొన్నారు. బిహార్ను అన్నివిధాలా అభివృద్ధి చేసేందుకు కేంద్రం చిత్తశుద్ధితో పనిచేస్తోందన్నారు. రాష్ట్రంలో పెద్ద ఎత్తున వలసలకు కారణమైన గత పాలకులు ఇప్పుడు.. అధికారాన్ని చేజిక్కించుకోవడానికి సామాజిక న్యాయం చేస్తున్నట్టు నటిస్తున్నారని ఆర్జేడీ నేతలపై పరోక్షంగా విమర్శలు చేశారు. ఈ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీని గెలిపిస్తే సామాజిక న్యాయం అంటే ఏంటో చేసిచూపిస్తామని తెలిపారు.
యూపీలో రూ. 47 వేల కోట్లతో అభివృద్ధి పనులు
ఆపరేషన్ సిందూర్తో భారత స్వదేశీ ఆయుధాల శక్తి ప్రపంచానికి తెలిసి వచ్చిందని మోదీ అన్నారు. ఉత్తరప్రదేశ్లోని కాన్పూర్లో రూ. 47,600 కోట్లకు పైగా విలువైన 15 ప్రాజెక్టులకు ప్రారంభం, శంకుస్థాపన తర్వాత జరిగిన ర్యాలీలో మోదీ ఈ కామెంట్స్ చేశారు.
పహల్గాం మృతుడి కుటుంబానికి పరామర్శ
పహల్గాం ఉగ్రవాద దాడిలో మరణించిన 26 మందిలో ఒకరైన శుభం ద్వివేది కుటుంబాన్ని పీఎం మోదీ కలిశారు. కాన్పూర్లోని చకేరి విమానాశ్రయంలో కలిసి, వారిని పరామర్శించారు. మోదీని చూడగానే శుభం ద్వివేది కుటుంబ సభ్యులు కన్నీటిపర్యంతమయ్యారు. వారిని చూసి మోదీ కూడా భావోద్వేగానికి గురయ్యారు. ప్రభుత్వం అండగా ఉంటుందని ఆ కుటుంబంలో భరోసా నింపిన మోదీ.. టెర్రరిజంపై పోరు కొనసాగుతుందని చెప్పారు.