- దక్షిణ రాష్ట్రాల ప్రాంతీయ వ్యవసాయ సదస్సులో
హైదరాబాద్, వెలుగు: దక్షిణాది రాష్ట్రాలు హార్టీకల్చర్పంటలకు అనుకూలంగా ఉంటాయని, అందువల్ల ఆయా ప్రభుత్వాలు కూరగాయలు, పండ్ల సాగు వైపు రైతులను ప్రోత్సహించాలని కేంద్ర వ్యవసాయ, రైతు సంక్షేమ శాఖ మంత్రి శివరాజ్సింగ్ చౌహాన్ పిలుపునిచ్చారు. ఒక్కో రాష్ట్రంలో వ్యవసాయ పరిస్థితులు ఒక్కో రకంగా ఉన్నందున ప్రాంతీయ అవసరాలకు అనుగుణంగా వ్యవసాయ ప్రణాళికలు రూపొందించాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడ్డారు. ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్లతో మనకు ప్రపంచస్థాయి మార్కెట్లు అందుబాటులోకి వచ్చాయని, ఈ అవకాశాన్ని రైతులు సద్వినియోగం చేసుకోవాలన్నారు. శుక్రవారం హైదరాబాద్లోని ఓ హోటల్లో నిర్వహించిన దక్షిణ రాష్ట్రాల ప్రాంతీయ వ్యవసాయ సదస్సులో ఆయన ప్రసంగించారు.
వ్యవసాయ రంగంలో ఎదురవుతున్న సవాళ్లు, ఎల్నినో ప్రభావం, పంటల వైవిధ్యీకరణ, యాసంగి సీజన్ సన్నద్ధత తదితర అంశాలపై సదస్సులో చర్చించారు. ఈ సందర్భంగా చౌహాన్ మాట్లాడుతూ.. కేవలం చర్చలకే పరిమితం కాకుండా రైతుల జీవితాల్లో స్పష్టమైన మార్పు తీసుకురావడమే సదస్సు లక్ష్యమని స్పష్టం చేశారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, మెషిన్ లెర్నింగ్, రోబోటిక్స్ వంటి సాంకేతిక పరిజ్ఞానాలు వేగంగా అభివృద్ధి చెందుతున్నప్పటికీ వ్యవసాయానికి ప్రత్యామ్నాయం లేదన్నారు. వ్యవసాయ ఉత్పత్తులకు అంతర్జాతీయ మార్కెట్లలో కొత్త అవకాశాలు ఏర్పడుతున్నాయని ధాన్యాలకు డిమాండ్ ఉందో అధ్యయనం చేసి, అందుకు అనుగుణంగా రైతులను ఉత్పత్తి వైపు ప్రోత్సహించాలని సూచించారు.
