
అంకారా: అహ్మదాబాద్లో కూలిన విమానం బోయింగ్ 787-8 డ్రీమ్ లైనర్ మెయింటెనెన్స్ను టర్కీకి చెందిన ‘టర్కిష్ టెక్నిక్’ అనే ఎయిర్ క్రాఫ్ట్ మెయింటెనెన్స్ కంపెనీ చూసుకునేదని సోషల్ మీడియాలో జరిగిన ప్రచారాన్ని టర్కీ ప్రభుత్వం ఖండించింది. ఇందులో ఏమాత్రం నిజం లేదని.. పూర్తిగా తప్పుడు ప్రచారం అని టర్కీ ఒక ప్రకటనలో పేర్కొంది. ‘టర్కిష్ టెక్నిక్’ కంపెనీ ఎయిర్ ఇండియాతో మెయింటెనెన్స్ అగ్రిమెంట్ కుదుర్చుకున్న మాట వాస్తవమే కానీ బోయింగ్ 777 ఎయిర్ క్రాఫ్ట్ మెయింటెనెన్స్ బాధ్యతలు మాత్రమే సదరు కంపెనీ చూస్తోందని.. బోయింగ్ 787-8 డ్రీమ్ లైనర్ విమానం మెయింటెనెన్స్ బాధ్యతలు కాదని టర్కీ ప్రభుత్వం స్పష్టం చేసింది.
ఎయిర్ ఇండియా, ‘టర్కిష్ టెక్నిక్’ కంపెనీ మధ్య 2024లో, 2025లో అగ్రిమెంట్ జరిగిందని.. ఈ అగ్రిమెంట్లో 787 రకం విమానాల ప్రస్తావనే లేదని టర్కీ అధికారులు తెలిపారు. ఇప్పటిదాకా 787 రకం ఎయిర్ ఇండియా విమానాలకు ఎలాంటి మెయింటెనెన్స్ చేయలేదని.. దుష్ప్రచారం చేస్తున్నారని టర్కీ ప్రభుత్వం వివరణ ఇచ్చింది. మెయింటెనెన్స్ సరిగా లేదని, అందువల్లే ఈ విమానం ఇలా కుప్పకూలిపోయి ఇంతమందిని పొట్టనపెట్టుకుందని విమర్శలొచ్చిన సంగతి తెలిసిందే. ఈ విమర్శలొచ్చిన క్రమంలో.. అసలు ఈ విమానం మెయింటెనెన్స్ బాధ్యతలు ఎవరు చూస్తు్న్నారనే చర్చ జరిగింది. టర్కీనే ఎయిర్ ఇండియా విమాన మెయింటెనెన్స్ బాధ్యతలు చూసుకునేదని, ఈ విమాన ప్రమాదంలో కుట్ర కోణం ఉందని సోషల్ మీడియాలో జోరుగా ప్రచారం జరిగింది. ఈ క్రమంలో.. ఈ ఆరోపణలపై టర్కీ వివరణ ఇచ్చింది.
The #Türkiye government clarified that claims suggesting #Turkish Technic performed maintenance on the #Boeing 787-8 passenger aircraft involved in an #AirIndia crash during takeoff are false. According to the statement, maintenance agreements between Air India and Turkish… pic.twitter.com/6ZehR42nfP
— durgeshkdubey (@ToolsTech4All) June 15, 2025
అహ్మదాబాద్ ఎయిర్ పోర్టు నుంచి గురువారం మధ్యాహ్నం ఎయిర్ ఇండియా బోయింగ్ 787=8 డ్రీమ్ లైనర్ విమానం టేకాఫ్ అవుతున్నప్పుడు తొలుత అంతా సవ్యంగానే ఉన్నట్టు కనిపించింది. కానీ ఆ తర్వాత కొన్ని క్షణాలకే ప్లేన్ పైకి ఎగరడంలో ఫెయిల్ అవుతోందని, ఏదో సమస్య తలెత్తిందని చూసేవాళ్లకు అనిపించింది. మరికొన్ని క్షణాలు గడిచేసరికి విమానం పైకి ఎగరకపోగా.. క్రమంగా ఎత్తును కోల్పోతూ కిందకు వెళ్తున్నట్టు కనిపించింది. విమానం ఎగరడంలో ఫెయిల్ అయిందని స్పష్టంగా అర్థమయ్యేలోపే.. మొత్తంగా టేకాఫ్ అయిన 38 సెకన్లలోనే విమానం క్రాష్ అయి ఒక్కసారిగా పేలిపోయింది. ప్రమాదానికి కచ్చితమైన కారణమేంటన్నది తెలియాలంటే కొన్ని నెలల సమయం పట్టే అవకాశాలు ఉన్నాయి. ఈ ఘటనపై సమగ్ర దర్యాప్తు జరిగిన తర్వాతే ప్లేన్ ఎందుకు కూలిపోయిందన్నది తేలుతుంది.