
- వినియోగం కోసం ప్రభుత్వం చర్యలు
- పలు సంస్థలతో మంత్రి తుమ్మల సమీక్ష
హైదరాబాద్, వెలుగు: అగ్రికల్చర్ రంగంలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్(ఏఐ) టెక్నాలజీని వినియోగించే దిశగా రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకుంటున్నది. దీనిలో భాగంగా వ్యవసాయ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు గత రెండు, మూడు రోజులుగా వివిధ ఏఐ సంస్థల ప్రతినిధులతో వరుస సమావేశాలు నిర్వహిస్తున్నారు. శుక్రవారం సెక్రటేరియెట్ లో జరిగిన సమావేశంలో ప్రొఫెసర్ జయశంకర్ అగ్రికల్చర్ వర్సిటీ తరపున ప్రొఫెసర్ డాక్టర్ నీలిమ పాల్గొన్నారు. గత మూడేళ్లుగా నిర్వహిస్తున్న పరిశోధనల ఫలితాలను మంత్రికి ఆమె వివరించారు.
ఉపగ్రహ చిత్రాల ఆధారంగా పంటల సాగు విస్తీర్ణం అంచనా, వివిధ రాష్ట్రాలకు అందిస్తున్న సేవల గురించి ఇక్రిసాట్ ప్రతినిధులు వివరించారు. ఉపగ్రహ చిత్రాల ద్వారా పంటలకు సంబంధించిన తెగుళ్లు, క్రిమికీటకాలు, నీటి ఎద్దడి పరిస్థితులను అంచనా వేసే పద్ధతుల గురించి అగ్రివాస్ సంస్థ ప్రతినిధులు తెలిపారు. అలాగే, రైతులు తమ పరిశోధనల ద్వారా ఎలా ప్రయోజనం పొందుతున్నారో వెల్లడించారు. ఈ సందర్భంగా మంత్రి తుమ్మల మాట్లాడుతూ.. వ్యవసాయ రంగంలో ఏఐ సాంకేతికతను ఉపయోగించి, రైతులకు అందే సేవలను మరింత సమర్థవంతంగా అమలు చేయడానికి ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు.
ఈ వానాకాలం నుంచి పైలట్ ప్రాజెక్టుగా అందుబాటులో ఉన్న ఏఐ టెక్నాలజీని వినియోగించి ఆలోచన ఉందన్నారు. ఈ సమావేశంలో ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి, అగ్రికల్చర్ సెక్రటరీ రఘునందన్ రావు, అగ్రికల్చర్, అగ్రివర్సిటీ అధికారులు పాల్గొన్నారు.