ఎవరికి టికెట్ ఇస్తే గెలుస్తం?..అభిప్రాయాలు సేకరించిన దీపాదాస్ మున్షీ

ఎవరికి టికెట్ ఇస్తే గెలుస్తం?..అభిప్రాయాలు సేకరించిన దీపాదాస్ మున్షీ
  • డీసీసీ అధ్యక్షులు, ఎమ్మెల్యేలు, ఇన్​చార్జ్​లతో భేటీ
  • రిపోర్ట్ రెడీ చేసి హైకమాండ్​కు ఇవ్వనున్న ఏఐసీసీ స్టేట్ ఇన్​చార్జ్

హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో పెండింగ్​లో ఉన్న 13 ఎంపీ అభ్యర్థుల ఎంపికపై ఏఐసీసీ స్టేట్ ఇన్​చార్జ్ దీపాదాస్ మున్షీ పార్టీ నేతలతో సమావేశమై అభిప్రాయాలు సేకరించారు. బుధవారం గాంధీ భవన్ లో ఉదయం 10 గంటల నుంచి రాత్రి 7 గంటల వరకు మీటింగ్ జరిగింది. ఒక్కో నియోజకవర్గం నుంచి ముగ్గురు అభ్యర్థులు పోటీ పడుతున్న నేపథ్యంలో డీసీసీ అధ్యక్షులు, ఎమ్మెల్యేలు, నియోజకవర్గ ఇన్​చార్జ్​ల నుంచి ఆమె ఓపీనియన్స్ తీసుకున్నారు. 

‘‘మీ నియోజకవర్గానికి ఎంపీ అభ్యర్థి ఎవరైతే బాగుంటుంది? మీరు ఎవరికి మద్దతిస్తున్నరు? పార్టీ గెలిచేందుకు అవకాశాలు ఉన్నాయా? టికెట్ ఇచ్చిన వ్యక్తి మిగతా రెండు పార్టీల అభ్యర్థులకు ధీటుగా ఖర్చు పెడ్తాడా? వంద రోజుల కాంగ్రెస్ పాలనపై ప్రజలు ఏమంటున్నరు? స్కీమ్​లపై సంతృప్తి చెందారా?”వంటి విషయాలను దీప్ దాస్ మున్షీ స్థానిక నేతలను అడిగి తెలుసుకున్నట్టు సమాచారం. ఈ అభిప్రాయ సేకరణను రిపోర్ట్ రూపంలో ఆమె ఏఐసీసీకి పంపనున్నట్టు తెలుస్తున్నది. 13 స్థానాలకు టికెట్లు ఆశిస్తున్న నేతలను మాత్రం ఈ మీటింగ్​కు అనుమతించలేదు.

గాంధీభవన్​కు వచ్చిన ఆశావహులు

హైదరాబాద్ టికెట్ కోసం అజారుద్దీన్, ఫిరోజ్ ఖాన్, సికింద్రాబాద్ నుంచి బొంతు రామ్మెహన్, మెదక్ నుంచి నిర్మల జగ్గారెడ్డి, భవాని రెడ్డి పోటీపడుతున్నారు. ఆదిలాబాద్ నుంచి మాజీ ఎమ్మెల్యే రేఖానాయక్ భర్త శ్యామ్ నాయక్ టికెట్ ఆశిస్తున్నాడు. ఈ మేరకు వీళ్లంతా బుధవారం గాంధీభవన్​కు వచ్చారు. పెద్దపల్లి ఎంపీ టికెట్ విషయమై దీప్ దాస్ మున్షీతో చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి సమావేశమయ్యారు. 

కాంగ్రెస్ కు, కాకా కుటుంబానికి ఎంతో అనుబంధం ఉందని వివేక్ గుర్తు చేశారు. వెంకటస్వామి కేంద్ర మంత్రిగా, 2009లో తాను ఎంపీగా గెలిచామని వివరించారు. తన కొడుకు గడ్డం వంశీకృష్ణకు టికెట్ ఇవ్వాలని దీపాదాస్ మున్షీని ఆయన కోరినట్లు సమాచారం. కాగా, ఈ మీటింగ్​కు నాగర్​కర్నూల్ ఎంపీ టికెట్ వ్యవహారంపై మంత్రి జూపల్లి కృష్ణారావు, విప్ ఆది శ్రీనివాస్, ఎమ్మెల్యేలు మల్ రెడ్డి రంగారెడ్డి, వేముల వీరేశం, మధుసూదన్ రెడ్డి, మందుల సామేలు, జారే ఆదినారాయణతో పాటు పలువురు ఎమ్మెల్యేలు అటెండ్ అయ్యారు.

రేపు సీఈసీ మీటింగ్

కాంగ్రెస్ అభ్యర్థుల ఎంపికకు సంబంధించి ఈ నెల 15న సాయంత్రం ఢిల్లీలో సీఈసీ మీటింగ్ జరగనుంది. బుధవారమే ఈ మీటింగ్ జరగాల్సి ఉండగా, ఏఐసీసీ చీఫ్ మల్లిఖార్జున ఖర్గే కర్నాటక టూర్ లో, పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ గుజరాత్ పర్యటనలో ఉండటంతో వాయిదా పడినట్లు తెలుస్తున్నది. కాగా, ఈ నెల 15న జరగనున్న మీటింగ్ తర్వాత తెలంగాణకు సంబంధించి 4 లేదా 5 సీట్లకు అభ్యర్థులను ప్రకటించనున్నట్లు తెలుస్తున్నది.

టికెట్ కోసమే దీపాదాస్​తో భేటీ: నిర్మల జగ్గారెడ్డి

మెదక్ పార్లమెంట్ సీటు విషయంలో దీప్ దాస్ మున్షీతో చర్చించానని, తనకు అవకాశం ఇవ్వాలని కోరినట్టు సంగారెడ్డి డీసీసీ ప్రెసిడెంట్ నిర్మల జగ్గారెడ్డి తెలిపారు. పార్టీలో మొదటి నుంచి కష్టపడి పనిచేసే వారికే అవకాశం ఇవ్వాలని ఇన్​చార్జ్​తో చెప్పానని వివరించారు. గాంధీ భవన్​లో మెదక్ మీటింగ్ తర్వాత ఆమె మీడియాతో మాట్లాడారు. కాగా, ఆదిలాబాద్ ఎంపీ టికెట్ మాజీ ఎమ్మెల్యే, తన భార్య రేఖా నాయక్​కు ఇవ్వాలని శ్యామ్ నాయక్ కోరారు. 

ఈ నేపథ్యంలో సెగ్మెంట్ పరిధిలో ఉన్న ఎమ్మెల్యే ఎడ్మబొజ్జుతో పాటు మరో ఆరు మంది నియోజక ఇన్​చార్జ్​లతో దీప్ దాస్ మున్షీ భేటీ అయి అభిప్రాయాలు సేకరించారు. కాగా, బీజేపీ, బీఆర్ఎస్ లేదా బీఎస్పీలు ఆదివాసీ అభ్యర్థిని పోటీలో ఉంచుతున్న నేపథ్యంలో లంబాడా అభ్యర్థికి అవకాశం ఇవ్వాలని మున్షీతో నేతలు కోరినట్లు తెలుస్తున్నది.