
న్యూఢిల్లీ: ఎయిర్ ఇండియా గ్రూప్ చాలా పెద్దదని, ప్రమాదాలు జరగడం సాధారణమేనని ఈ సంస్థ సీఈఓ క్యాంప్బెల్ విల్సన్ అన్నారు. రోజుకు 1,200కి పైగా విమానాల సర్వీస్లను నడుపుతున్నామని తెలిపారు. సర్వీస్ లోపాలు ఉంటే ప్రయాణికులకు ఈ–ఓచర్లు అందించే అధికారం క్యాబిన్ క్రూ సిబ్బందికి ఇస్తామని తెలిపారు. బ్యాగేజీ సమస్యల వంటి సందర్భాల్లో ప్రయాణంలోనే పరిష్కారం అందించేందుకు ఇది ఉపయోగపడుతుంది. ఎయిర్ ఇండియా గ్రూప్ కింద ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్, ఎయిర్ ఇండియా ఉన్నాయి.
ఈ ఏడాది జూన్ 12న జరిగిన బోయింగ్ 787 డ్రీమ్లైనర్ ప్రమాదం తర్వాత, తమపై నమ్మకాన్ని మెరుగుపరచేందుకు కంపెనీ చర్యలు తీసుకుంటోంది. సంస్థ పారదర్శకతను పెంచుతూ, చిన్న ఘటనలైనా ప్రజలకు తెలియజేస్తోందని విల్సన్ అన్నారు. దీని వల్ల న్యూస్ కవరేజ్ పెరిగినా, దీర్ఘకాలంలో ప్రజలకు తమపై నమ్మకం పెరుగుతుందని విశ్వాసం వ్యక్తం చేశారు. ఎయిర్ ఇండియా ఇప్పుడు ఇన్ఫ్లైట్ మ్యాగజైన్, స్పెషాలిటీ మెనూ ఆఫర్ చేయడం, సోషల్ మీడియాలో బ్రాండ్ విలువను పెంచడంపై దృష్టి పెట్టింది.