
- స్నిఫర్ డాగ్స్ తో ఆపరేషన్
- చెల్లా చెదురుగా శరీరభాగాలు
- ఇప్పటి వరకు 265 శవాల గుర్తింపు
- ప్రమాదంపై దర్యాప్తు కోసం సిట్
ఆహ్మదాబాద్: ఎయిరిండియా ఫ్లైట్ ప్రమాదం ఎన్నో కుటుంబాల్లో విషాదం మిగిల్చింది. ఇప్పటి వరకు 265 మంది శవాలను గుర్తించినట్టు ఆహ్మదాబాద్ డిప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీస్ కనన్ దేశాయ్ చెబుతున్నారు. అయితే మృతుల సంఖ్య ఇంకా పెరిగే అవకాశం ఉందనీ అంటున్నారు. నిన్న మధ్యాహ్నం ఆహ్మదాబాద్ నుంచి లండన్ వెళ్తున్న ఎయిర్ ఇండియా బోయింగ్ 787-8 విమానం టేకాఫ్ అవుతుండగా ప్రమాదానికి గురైంది. ఓ మెడికల్ కాలేజీ మెస్ పై కూటింది. ప్రమాద ధాటికి చుట్టు పక్కల ఇండ్లు , చెట్లు ధ్వంసమయ్యాయి. విమానంలో ప్రయాణిస్తున్నవారిలో ఒక్కరు మాత్రమే ప్రాణాలతో బతికి బయటపడ్డారు. విమానం తోక భాగం మెడికల్ కాలేజీ హాస్టల్ పై ముందు భాగం, వీల్ విద్యార్థులు భోజనం చేస్తున్న మెస్ పై పడింది. దీంతో ఆ సమయంలో భోజనం చేస్తున మెడికోలు కూడా మృతి చెందారు. నివాస ప్రాంతాల్లోనూ విమాన శకలాలు పడటంతో మృతుల సంఖ్య ఇంకా ఎక్కువగా ఉండే అవకాశం ఉందని సమాచారం.
స్నిఫర్ డాగ్స్ తో తనిఖీ
మృత దేహాల జాడలను కనుగొనేందుకు స్నిఫర్ డాగ్స్ సహాయం తీసుకుంటున్నారు అధికారులు. మొత్తం విమానంలో మరణించిన వారితో పాటు నేలపై మృతి చెందిన వారి వివరాలనూ సేకరించామని, మొత్తం 265 మంది శవాలు లభ్యమైనట్టు పోలీసు ఉన్నతాధికారులు తెలిపారు. అయితే డాగ్ స్క్వాడ్ తో రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతోందని మృతుల సంఖ్య మరింతగా పెరిగే అవకాశం ఉందని అంటున్నారు. వాటి సాయంతో కొందరి శరీర భాగాలను గుర్తించినట్టు వివరించారు. మృతదేహాలను చెక్క శవపేటికల్లో పెట్టి ఆస్పత్రి మార్చురీకి తరలించామని, వాటిని డీఎన్ఏ టెస్టుల తర్వాత ఇవ్వనున్నట్టు వివరించారు.
డీఎన్ఏ కోసం శాంపిళ్ల సేకరణ
విమాన ప్రమాదంలో మరణించిన వారి కుటుంబ సభ్యుల నుంచి డీఎన్ఏ కోసం అధికారులు శాంపిళ్లను సేకరించారు. డీఎన్ఏ పరీక్షల అనంతరం మృతదేహాలను గుర్తించి వారి కుటుంబీకులకు అప్పగించనున్నారు. డీఎన్ఏ పరీక్షల అనంతరం మృతదేహాలను కుటుంబ సభ్యులకు అప్పగించనున్నారు. ప్రమాదంలో మృతదేహాలన్ని కూడా మాంసపు ముద్దల్లా మారిపోయాయి.