
జమ్మూకశ్మీర్లో పనిచేసే సీఆర్ఫీఎఫ్, పారామిలటరీ దళాల భద్రతపై కేంద్రం మరింత దృష్టపెట్టింది. ఆరాష్ట్రంలో పనిచేసే జవాన్లు ఇకమీదట విధుల్లో చేరాలన్నా లేదా సెలవులకు ఇంటికి వెళ్లాలన్నా రోడ్డు మార్గాన్ని ఆశ్రయించాల్సిన పనిలేదు. వారికి కమర్షియల్ ఫ్లైట్స్ సదుపాయాన్ని కల్పించనున్నారు. ఫ్లైట్స్లో డ్యూటీ లో చేరడానికి, సెలవుల్లో సొంత స్థలాలకు వెళ్లడానికి అనుమతిస్తూ కేంద్ర హోంమంత్రిత్వశాఖ గురువారం ఉత్తర్వులు జారీచేసింది. పుల్వామా దగ్గర మిలటరీ కాన్వాయ్పై టెర్రరిస్టులు జరిపిన దాడిలో 40 మంది సైనికులు చనిపోయిన ఘటన నేపథ్యంలో కేంద్రం ఈనిర్ణయం తీసుకుంది.
సెంట్రల్ ఆర్మ్డ్ పోలీస్ ఫోర్సెస్ సిబ్బంది ఢిల్లీ-శ్రీనగర్, శ్రీనగర్-ఢిల్లీ, జమ్మూ-శ్రీనగర్, శ్రీనగర్- జమ్మూ సెక్టర్ల మధ్య ఎయిర్ ట్రావెల్ చేసేందుకు అనుమతి లభించడంవల్ల సుమారు 7 లక్షల 80 వేలమంది పారామిలటరీ సిబ్బందికి లాభం చేకూరుతుంది. అంతకుముందు ఎయిర్ ట్రావెల్కు అర్హతలేని కానిస్టేబుల్, హెడ్కానిస్టేబుల్, అసిస్టెంట్ సబ్ ఇన్స్పెక్టర్ కూడా కేంద్ర నిర్ణయంతో లబ్ధిపొందనున్నారు.