వ‌ర‌ల్డ్ బ్యాంక్ ప్రెసిడెంట్‌గా భార‌త సంత‌తికి చెందిన‌ అజ‌య్ బంగా

వ‌ర‌ల్డ్ బ్యాంక్ ప్రెసిడెంట్‌గా భార‌త సంత‌తికి చెందిన‌ అజ‌య్ బంగా

వ‌ర‌ల్డ్ బ్యాంక్ ప్రెసిడెంట్‌గా మాస్టర్ కార్డ్ మాజీ సీఈవో, భార‌త సంత‌తికి చెందిన‌ అజ‌య్ బంగా నియామ‌కం కానున్నారు. అజ‌య్ బంగా వ‌ర‌ల్డ్ బ్యాంక్ ప్రెసిడెంట్‌గా ఈ ఏడాది జూన్ 2వ తేదీన బాధ్యత‌లు స్వీక‌రించ‌నున్నారు. ఈ ప‌ద‌విలో ఆయ‌న ఐదేండ్ల పాటు కొన‌సాగ‌నున్నారు. వ‌ర‌ల్డ్ బ్యాంక్ ప్రెసిడెంట్ పోస్టుకు అజ‌య్ బంగా నామినేట్ అయ్యారు. ఆయ‌న అభ్యర్థిత్వాన్ని బోర్డు స‌భ్యులంద‌రూ ఆమోదించిన అనంత‌రం వ‌రల్డ్ బ్యాంక్ ఒక ప్రక‌ట‌న చేసింది. అజ‌య్ బంగా వ‌రల్డ్ బ్యాంక్ ప్రెసిడెంట్‌గా ఐదేండ్ల పాటు కొన‌సాగుతార‌ని వెల్లడించింది.

189 దేశాలకు సభ్యత్వం ఉన్న ప్రపంచ బ్యాంక్‌లో ముఖ్యమైన విభాగాలన్నింటికీ భారతీయులే నేతృత్వం వహిస్తున్నారు. ఈ వ‌ర‌ల్డ్‌ బ్యాంక్‌లో వివిధ హోదాల్లో ఉన్న ఇండియన్స్ సేవ‌లందిస్తున్నారు. చీఫ్‌ ఫైనాన్షియల్‌ ఆఫీసర్‌గా అన్షులా కాంత్‌, చీఫ్‌ ఎకానమిస్ట్‌గా ఇందర్‌మిత్‌ గిల్‌, చీఫ్‌ రిస్క్‌ ఆఫీసర్‌గా లక్ష్మీ శ్యామ్‌ సుందర్‌, ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్‌గా పరమేశ్వరన్‌ అయ్యర్ కొన‌సాగుతున్నారు.