- తన కామెంట్లను సమర్థించుకున్న ఎన్సీపీ చీఫ్ అజిత్ పవార్
- మాకు ఓట్లేయకపోతే నిధులు ఆపేస్తానని అంతకుముందురోజు వ్యాఖ్య
ముంబై: తన మాటల్లో తప్పేం లేదని నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ(ఎన్సీపీ–అజిత్) చీఫ్, మహారాష్ట్ర డిప్యూటీ సీఎం అజిత్ పవార్ సమర్థించుకున్నారు. ఓటర్లనుద్దేశించి తాను చేసిన కామెంట్లు బెదిరింపులు ఎలా అవుతాయని ప్రశ్నించారు. ఎన్నికల్లో తమ పార్టీ అభ్యర్థులను గెలిపించకపోతే, నిధులు కట్ చేస్తానంటూ శుక్రవారం తాను చేసిన వ్యాఖ్యలపై.. ఆయన ఆదివారం మహారాష్ట్ర సీఎం దేవేంద్ర ఫడ్నవీస్తో కలిసి మీడియా ఎదుట వివరణ ఇచ్చుకున్నారు.
కేంద్రం, రాష్ట్రం నుంచి వచ్చే నిధులతో ప్రజల మౌలిక అవసరాలు తీర్చాలన్నదే తన ఉద్దేశమని చెప్పారు. ఎన్నికలప్పుడు అందరూ హామీలిస్తారని, తానూ అదేరీతిలో హామీ ఇచ్చానని చెప్పుకొచ్చారు. అందులో బెదిరింపు ఎక్కడుంది అని నిలదీశారు.
ప్రతిపక్షాల విమర్శలను పట్టించుకోనని, తానెప్పుడూ నిజాలు మాట్లాడ్తానని స్పష్టం చేశారు. సీఎం ఫడ్నవీస్ కూడా పవార్ కామెంట్లను సమర్థించారు. ఎన్నికల్లో అలాంటి మాటలు సహజమేనని అన్నారు.
పవార్ఏమన్నడంటే..
మహారాష్ట్రలోని మాలేగావ్ నగర్ పంచాయతీ ఎన్నికల ప్రచారంలో అజిత్ పవార్ శుక్రవారం పాల్గొని మాట్లాడారు. తన పార్టీ(ఎన్సీపీ) అభ్యర్థులందరినీ గెలిపిస్తేనే నిధులు మంజూరు చేస్తానని అన్నారు. ‘‘నా పార్టీ అభ్యర్థులు 18 మందిని గెలిపిస్తే నిధులు విడుదల చేస్త. ఎంతమంది అభ్యర్థులు తగ్గితే అంత నిధులు కట్ చేస్త.
మీ దగ్గర ఓట్లున్నయ్, నా దగ్గర ఫండ్స్ ఉన్నయ్. ఓటు హక్కు మీదగ్గరుంది.. నిధులు రిలీజ్ చేసే అధికారం నా చేతిలో ఉంది. ఇక నిర్ణయం మీదే” అని పవార్బహిరంగంగా ప్రకటించారు. ఈ కామెంట్లు రాష్ట్రవ్యాప్తంగా తీవ్ర దుమారం రేపాయి.
