అలంపూర్, వెలుగు: న్యాయవాదుల రక్షణ చట్టం అమలు చేయాలని డిమాండ్ చేస్తూ ఆదివారం అలంపూర్ బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఉమ్మడి జిల్లా న్యాయవాదులు పాదయాత్రను ప్రారంభించారు. అలంపూర్ నుంచి హైదరాబాద్ వరకు ఈ పాదయాత్ర కొనసాగనుంది. న్యాయవాదులు ముందుగా జోగులాంబ, బాలబ్రహ్మేశ్వర స్వామికి ప్రత్యేక పూజలు నిర్వహించి పాదయాత్ర ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. పాదయాత్ర వారం రోజులు కొనసాగుతుందని, దేశంలోని లాయర్లకు రక్షణ కల్పిస్తూ చట్టాలు అమలు చేయాలని డిమాండ్ చేశారు. జూనియర్ లాయర్లకు రూ.5 వేల స్టైఫండ్ ఇవ్వాలని, న్యాయవాదులకు హెల్త్ కార్డు ఇవ్వాలన్నారు.
హైదరాబాద్ లో గవర్నర్, సీఎం, హైకోర్టు న్యాయమూర్తులకు వినతిపత్రం అందజేస్తామని తెలిపారు. పాదయాత్రకు తెలంగాణ ఫెడరేషన్ ఆఫ్ బార్ అసోసియేషన్ అధ్యక్షుడు అనంతరెడ్డి, స్టేట్ బార్ మెంబర్ హనుమంత్ రెడ్డి, న్యాయవాదులు వెంకటేశ్, జగన్మోహన్ రెడ్డి తదితరులు మద్దతు తెలిపారు. పాదయాత్రలో గువ్వల శ్రీనివాసులు, నరసింహులు, నారాయణరెడ్డి, తిమ్మారెడ్డి, శ్రీధర్ రెడ్డి, గజేంద్ర గౌడ్, ఆంజనేయులు, మధు, వెంకటేశ్, హేమంత్ యాదవ్, యాకూబ్, నాగయ్య, బొంకూర్ మధు, బల్గేర హుసేన్, రవి కుమార్ పాల్గొన్నారు.
