- ప్రధానోపాధ్యాయుడు, ఉపాధ్యాయురాలికి నోటీసులు
కందనూలు, వెలుగు: నాగర్కర్నూల్ జిల్లా కేంద్రంలోని బాలికల ఉన్నత పాఠశాలలో మధ్యాహ్న భోజన నాణ్యతపై కలెక్టర్ బాదావత్ సంతోష్ ఆగ్రహం వ్యక్తం చేశారు. సోమవారం పాఠశాలను ఆకస్మికంగా సందర్శించిన కలెక్టర్ విద్యార్థులతో కలిసి భోజనం చేశారు. ఆహార నాణ్యత, మెనూ అమలు విధానంపై అసహనం వ్యక్తం చేశారు. మెనూ ప్రకారం.. కిచిడీ, గుడ్డు, మిక్స్డ్ వెజిటబుల్ కర్రీ ఉండాలి కానీ, పాఠశాలలో విద్యార్థులకు వైట్ రైస్, గుడ్డు, సాంబార్ మాత్రమే వడ్డిస్తున్నట్లు కలెక్టర్ గమనించారు.
కామన్ డైట్ మెనూను ఎందుకు పాటించలేదని పాఠశాల సిబ్బందిని ప్రశ్నించారు. అన్నం సరిగా వండకపోవడం, సాంబార్ పసుపు నీళ్లలా ఉండటంతో ఇంత నాసిరకం భోజనం ఎవరూ తినరని మండి పడ్డారు. విధుల్లో నిర్లక్ష్యం వహించినందుకు పాఠశాల ప్రధానోపాధ్యాయుడు భాస్కర్ రెడ్డి, ఫుడ్ చెకింగ్ టీచర్పై చర్యలు తీసుకోవాలని జిల్లా విద్యాశాఖ అధికారి రమేష్ కుమార్కు ఫోన్ ద్వారా ఆదేశించారు.
ఇద్దరికీ షోకాజ్ నోటీసులు జారీ చేసి వివరణ కోరాలని సూచించారు. ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యక్రమంలో భాగంగా పాఠశాల ఆవరణలో చీపురు పట్టి శుభ్రత పనుల్లో పాల్గొన్నారు. మున్సిపల్ చైర్మన్ తీగల సునేంద్ర, వైస్ చైర్మన్ బాదాం రమేష్లతో కలిసి చెత్త తొలగించారు. ప్రజావాణి కార్యక్రమంలో 44 దరఖాస్తులు స్వీకరించిన కలెక్టర్ వాటిని సత్వర పరిష్కరించాలని ఆదేశించారు
