హైదరాబాద్, వెలుగు : అసెంబ్లీ ఎన్నికలకు టికెట్ల కేటాయింపులో మజ్లిస్ పార్టీ కార్పొరేటర్లకే ప్రాధాన్యం ఇచ్చింది. 9 స్థానాల్లో పోటీ చేస్తుండగా.. 8 సీట్లలో తాజా, మాజీ కార్పొరేటర్లనే రంగంలోకి దింపింది. చాంద్రాయణ్ గుట్ట అభ్యర్థి ఎమ్మెల్యే అక్బరుద్దీన్ మినహా మిగతా వారందరూ గతంలో కార్పొరేటర్లుగా పనిచేసిన వాళ్లే ఉన్నారు. గతంలో పత్తర్గట్టీ కార్పొరేటర్గా పని చేసిన అహ్మద్ బిన్ అబ్దుల్లా బలాలా 2009 నుంచి మలక్పేట్ ఎమ్మెల్యేగా కొనసాగుతున్నారు. ఈసారి కూడా ఆయన పోటీలో ఉన్నారు. మాజీ కార్పొరేటర్ జాఫర్ హుస్సేన్ మెరాజ్ కు గతంలో నాంపల్లి నుంచి టికెట్ ఇవ్వగా.. ఈసారి యాకత్పుర టికెట్ను పార్టీ కేటాయించింది.
కార్వాన్ నుంచి బరిలో ఉన్న కౌసర్ మొహినోద్దీన్ కూడా గతంలో కార్పొరేటర్ గా పనిచేశారు. మేయర్గా పనిచేసిన జుల్ఫికర్ అలీని పార్టీ ఇప్పుడు చార్మినార్ నుంచి ఎమ్మెల్యేగా పోటీకి నిలబెట్టింది. జుల్ఫికర్ తొలిసారిగా అసెంబ్లీకి పోటీ చేస్తున్నారు. మాజీ మేయర్ మాజిద్ హుస్సేన్ ను నాంపల్లి అభ్యర్థిగా బరిలోకి దింపింది. అలాగే షేక్ పేట్ కార్పొరేటర్ మహ్మద్ రషీద్ ఫరాజుద్దీన్ ను జూబ్లీహిల్స్ నుంచి, లంగర్ హౌస్ మాజీ కార్పొరేటర్ రవి యాదవ్ ను రాజేంద్రనగర్ నుంచి ఎంఐఎం బరిలోకి దింపుతోంది. ఇక కార్పొరేటర్ గా 20 ఏండ్ల నుంచి గెలుస్తూ వస్తున్న శాస్త్రిపురం కార్పొరేటర్ మహ్మద్ ముబీన్ ను బహదూర్ పుర నుంచి అసెంబ్లీ అభ్యర్థిగా మజ్లిస్ గురువారం ప్రకటించింది.