ఇండియా పేరు మార్చొద్దు..ఆల్ పార్టీ మీటింగ్​లో ప్రతిపక్షాల డిమాండ్

 ఇండియా పేరు మార్చొద్దు..ఆల్ పార్టీ మీటింగ్​లో ప్రతిపక్షాల డిమాండ్
  • పార్లమెంట్ సెషన్​లో చర్చకు సహకరించాలని కోరిన కేంద్రం
  • రాజ్​నాథ్ సింగ్ అధ్యక్షతన అఖిలపక్ష భేటీ

న్యూఢిల్లీ: మహిళా రిజర్వేషన్ బిల్లును సోమవారం నుంచి ప్రారంభమయ్యే పార్లమెంట్ సెషన్​లో ప్రవేశపెట్టాలని ఆల్ పార్టీ మీటింగ్​లో ప్రతిపక్షాలు కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశాయి. ఇండియా పేరును భారత్​గా మార్చే విషయాన్ని కూడా ప్రతిపక్షాలు చర్చకు తీసుకొచ్చారు. అన్ని అంశాలపై సుదీర్ఘంగా చర్చించుకుందామని, సభకు సహకరించాలని ప్రతిపక్షాలను కేంద్ర ప్రభుత్వం కోరింది. 

అందరికీ మాట్లాడే అవకాశం ఇస్తామని సూచించింది. పార్లమెంట్ లైబ్రరీ భవనంలో ఆదివారం ఆల్ పార్టీ మీటింగ్ జరిగింది. ఈ సమావేశానికి ప్రభుత్వం తరఫున డిఫెన్స్ మినిస్టర్, లోక్​సభ డిప్యూటీ లీడర్ రాజ్​నాథ్ సింగ్, లీడర్ ఆఫ్ రాజ్యసభ, కేంద్ర మంత్రి పీయుష్ గోయల్, పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి ప్రహ్లాద్ జోషి హాజరయ్యారు. ధరల పెరుగుదల, నిరుద్యోగం, మణిపూర్​లో అల్లర్లు, సామాజిక అసమానతల అంశంపై సభ్యులు చర్చించారు. మణిపూర్​లో శాంతి స్థాపనకు కేంద్రం చర్యలు తీసుకోవాలని ప్రతిపక్షాలు డిమాండ్ చేశాయి. మహిళా రిజర్వేషన్ బిల్లు ప్రవేశపెట్టి.. ఈ సెషన్​లోనే ఆమోదింపజేయాలంటూ బీజేడీ, బీఆర్ఎస్​తో పాటు పలు పార్టీలు కేంద్రాన్ని కోరాయి. ఇండియా పేరును భారత్​గా మార్చొద్దని డిమాండ్ చేశాయి. 

ఉభయ సభల్లో ప్రతిపక్షాలకు మాట్లాడే అవకాశం ఇవ్వాలని కోరాయి. అదేవిధంగా, పార్లమెంట్ స్పెషల్ సెషన్ ఎజెండా అంశాలపై కూడా కేంద్రంతో ఆల్ పార్టీ లీడర్లు చర్చించారు. ఆల్ పార్టీ మీటింగ్​కు కాంగ్రెస్ నుంచి అధిర్ రంజన్ చౌదరి, జేడీ(ఎస్) నుంచి హెచ్​డీ దేవేగౌడ, డీఎంకే నుంచి కనిమొళి, టీడీపీ నుంచి రామ్​ మోహన్ నాయుడు, టీఎంసీ నుంచి డెరెక్ ఒబ్రెయిన్, ఆమ్ ఆద్మీ పార్టీ తరఫున సంజయ్ సింగ్, బీజేడీ నుంచి సస్మిత్ పాత్ర, బీఆర్ఎస్ తరఫున కే.కేశవ్ రావు, ఆర్జేడీ నుంచి మనోజ్ ఝా, సమాజ్​వాది పార్టీ నుంచి గోపాల్ యాదవ్, వైఎస్సార్​సీపీ తరఫున విజయ సాయి రెడ్డి, తో పాటు మరికొన్ని పార్టీల అధ్యక్షులు, ప్రతినిధులు హాజరయ్యారు.