
- వరల్డ్ చాంపియన్షిప్ నుంచి వైదొలిగిన ఇండియా రెజ్లర్
- దీపక్ పునియా, వికాశ్, అమిత్ పరాజయం
న్యూఢిల్లీ: పారిస్ ఒలింపిక్ బ్రాంజ్ మెడలిస్ట్, ఇండియా స్టార్ రెజ్లర్ అమన్ సెహ్రావత్ వరల్డ్ చాంపియన్షిప్ నుంచి డిస్క్వాలిఫై అయ్యాడు. ఆదివారం క్రొయేషియాలోని జాగ్రెబ్లో జరిగిన ఈవెంట్కు ముందు అతను ఎక్కువ బరువు ఉండటంతో అనర్హత వేటు పడింది. మెన్స్ ఫ్రీస్టయిల్ 57 కేజీ విభాగంలో బరిలో నిలిచిన అమన్ వే–యిన్లో అమన్ 1.7 కిలోల అధిక బరువుతో ఉన్నట్లు తేలింది. వరల్డ్ కప్, యూడబ్ల్యూడబ్ల్యూ ర్యాంకింగ్ సిరీస్ టోర్నమెంట్లలో రెండు కిలోల వరకు బరువును అదనంగా అనుమతిస్తారు. కానీ, వరల్డ్ చాంపియన్షిప్స్, ఒలింపిక్స్లో ఇలాంటి నిబంధన ఏదీ లేదు.
గత నెల జరిగిన అండర్20 వరల్డ్ చాంపియన్షిప్స్లో నెహా సంగ్వాన్ (విమెన్స్ 59 కేజీ) 600 గ్రాముల అధిక బరువుతో అనర్హతకు గురైంది. దాంతో రెజ్లింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా (డబ్ల్యూఎఫ్ఐ) ఆమెను జట్టు నుంచి తొలగించి రెండేళ్ల నిషేధం కూడా విధించింది. నెహా మాదిరిగా అమన్పైనా డబ్ల్యూఎఫ్ఐ శిక్ష విధిస్తుందా లేక అతని స్టార్ హోదా కారణంగా వదిలేస్తుందా అనేది ఇప్పుడు ఆసక్తిగా మారింది. కాగా, ఈ టోర్నీలో నాన్ ఒలింపిక్ కేటగిరీ అయిన 92 కేజీల్లో పోటీ పడ్డ దీపక్ పునియా..తొలి రౌండ్లో 6–1తో బెంజిమిన్ గెరిల్ (ఆస్ట్రేలియా)పై గెలిచినా.. తర్వాతి బౌట్లో 3–4తో ఒస్మాన్ నర్మగొమెడోవ్ (అజర్బైజాన్) చేతిలో ఓడిపోయాడు. వికాశ్ సింగ్ (74 కేజీ), అమిత్ (79 కేజీ) తొలి రౌండ్లలోనే ఇంటిదారి పట్టగా.. ముకుల్ దహియా (86 కేజీ) రెపిఛేజ్ రౌండ్లో నెగ్గి కాంస్య పతక పోటీలో నిలిచాడు.