యూకేలో ఉద్యోగాలు, వీసా పేరుతో.. రూ. 35.50 లక్షల మోసం

యూకేలో ఉద్యోగాలు, వీసా పేరుతో.. రూ. 35.50 లక్షల మోసం
  • ఆర్మీ మేజర్ అవతారమెత్తిన నిందితుడు, అతని తండ్రి అరెస్ట్

అంబర్​పేట్, వెలుగు: యూకేలో ఉద్యోగం, వీసా ఇప్పిస్తామంటూ భారీ మొత్తంలో డబ్బులు వసూలు చేసి మోసం చేసిన తండ్రీకొడుకులను అంబర్​పేట్ పోలీసులు అరెస్ట్ చేశారు. ఇన్​స్పెక్టర్ కిరణ్ కుమార్ వివరాల ప్రకారం.. సిటీ శివారు అబ్దుల్లాపూర్​మెట్​కు చెందిన కొడాలి శ్రీ సాయి అలియాస్ కార్తీక్ తనను తాను ఆర్మీ మేజర్​గా పరిచయం చేసుకున్నాడు. అంబర్​పేటకు చెందిన బాధితుడు అనుమకొండ చంద్రశేఖర్​కు యూకేలో జాబ్ ఇప్పిస్తానని నమ్మించి, దశలవారీగా డిజిటల్ పేమెంట్స్ ద్వారా ఏకంగా రూ. 35.50 లక్షలు వసూలు చేశాడు. 

డబ్బులు తీసుకున్న తర్వాత వీసా, టికెట్ల విషయంలో నిందితుడు కాలయాపన చేస్తూ బాధితుడిని ఊరించసాగాడు. చివరకు మోసపోయానని గ్రహించిన చంద్రశేఖర్ అంబర్​పేట్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసిన పోలీసులు సాంకేతిక ఆధారాలతో నిందితుడు గోవాలోని కోల్వా బీబ్​లో ఉన్నట్లు గుర్తించి, అక్కడికి వెళ్లి అతడిని అదుపులోకి తీసుకున్నారు. తన తండ్రి కొడాలి రవికుమార్​తో కలిసి నిరుద్యోగులను మోసం చేస్తున్నట్లు నిందితుడు విచారణలో అంగీకరించడంతో ఇద్దరినీ అరెస్ట్ చేసి, రిమాండ్​కు తరలించారు.